Virat Kohli: టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో భారత వరుసగా రెండోసారి గెలిచి చరిత్ర సృష్టించింది. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని వీక్షించేందుకు టీమిండియా మాజీ కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ వచ్చి అభిమానులను అలరించారు. కానీ స్టార్ బ్యాటర్ కింగ్ విరాట్ కోహ్లీ మాత్రం ఈ వేడుకలలో ఎక్కడా కూడా కనిపించకపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. కోహ్లీ ఎందుకు రాలేదనే దానిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది.
ఐసీసీ రూల్స్ ప్రకారం.. ఈ ఫైనల్ మ్యాచ్కు ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మలను ప్రత్యేక ఆహ్వానితులుగా పిలిచారు. వీళ్లిద్దరూ గతంలో టీ20 వరల్డ్ కప్ను గెలిచిన కెప్టెన్లు కావడం గమనార్హం. 2007లో ఎంఎస్ ధోనీ, 2024లో రోహిత్ సారథ్యంలో ఇండియా విశ్వవిజేతగా అవతరించింది. కాగా విరాట్ కోహ్లీ కెప్టెన్గా ఉన్నప్పుడు టీ20 ప్రపంచ కప్ టైటిల్ ని గెలవలేదు. అందుకే మాజీ విజేత కెప్టెన్ల హోదాలో ధోనీ, రోహిత్ అధికారికంగా ఈ ప్రపంచ కప్ వేడుకలలో పాల్గొన్నారు. కానీ కోహ్లీకి అలాంటి అవకాశం లేకపోవడంతో అతడు ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది.
►ALSO READ | Gautam Gambhir: 2027 వన్డే వరల్డ్ కప్ కోసం భారత్ ప్రత్యేక వ్యూహం.. సన్నాహాలు స్టార్ట్ అయ్యేది అప్పుడే!
టెస్టులు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత విరాట్ కోహ్లీ కేవలం వన్డే క్రికెట్ మాత్రమే ఆడుతున్నాడు. గతంలో ఓ ఇంటర్వ్యూలో కోహ్లీ మాట్లాడుతూ.. ఒక్కసారి నేను క్రికెట్ నుంచి తప్పుకుంటే, కొంతకాలం పాటు ఎవరికీ కనిపించను చెప్పాడు. తన రిటైర్మెంట్ తర్వాత ఎక్కువ సమయాన్ని ఫ్యామిలితో గడపడానికే అతడు ఇష్టపడతారు. ప్రస్తుతం లండన్లో తన కుటుంబంతో కలిసి ఉంటున్న కోహ్లీ.. ఈ మ్యాచ్ను స్టేడియంకు వచ్చి చూడటం కంటే ఇంట్లోనే ఉండి ఎంజాయ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
క్రికెట్ నుంచి రెస్ట్ దొరికినప్పుడల్లా కోహ్లీ ప్రచారానికి దూరంగా ఉండటానికే ట్రై చేస్తున్నారు. 2024లో టీ20లకు రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత, ఆయన తన వ్యక్తిగత జీవితానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే ఈ మెగా టోర్నీ ఫైనల్కు దూరంగా ఉండి, భారత జట్టు విజయాన్ని తన సన్నిహితులతో కలిసి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ధోనీ, రోహిత్ స్టేడియంలో కనిపించి సందడి చేసినప్పటికీ.. విరాట్ కోహ్లీ గైర్హాజరు వెనుక ఆయన వ్యక్తిగత నిర్ణయాలే ఉన్నట్లు అర్థమవుతుంది. ఏది ఏమైనా తన కెరీర్ లో జట్టు గెలుపు కోసం పోరాడిన కోహ్లీ.. ఇప్పుడు ఒక ఫ్యాన్ గా ఇండియన్ టీమ్ వరల్డ్ కప్ గెలవడాన్ని చూసి సంబరపడిపోతున్నారని ఫ్యాన్స్ చెబుతున్నారు.
