చెట్టుకు వేలాడుతూ ఇద్దరు బాలికల శవాలు

చెట్టుకు వేలాడుతూ ఇద్దరు బాలికల శవాలు

అస్సాంలో దారుణం జరిగింది. ఇద్దరు టీనేజ్ బాలికల మృతదేహాలు చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. ఈ అమానుష ఘటన కొక్రాజార్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో వెలుగుచూసింది. బాలికలపై అత్యాచారం చేసి.. అనంతరం ఉరి తీసి చంపారని బాలికల కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. బాలికల వయసు 16,14 సంవత్సరాలు ఉంటుందని.. వీరిద్దరూ బంధువులవుతారని స్థానిక పోలీసులు తెలిపారు. కుటంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కుటుంబం ఆరోపించినట్లుగా ఇది ఆత్మహత్య లేక హత్యాచారామా అని నిర్ధారించడానికి పోలీసులు శవపరీక్ష నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు.

‘మేం అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నాం. అత్యాచారం జరిగిందా లేక ఆత్మహత్య చేసుకున్నారా అని తేలాలంటే.. పోస్టుమార్టం నివేదిక రావాల్సిందే. ఆలోపు మా దర్యప్తు చేస్తూనే ఉంటాం’ అని కొక్రాజార్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ ఎస్ఎస్ పనేసర్ అన్నారు.

బాలికల మృతిపట్ల అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ సంతాపాన్ని తెలిపారు. ఆదివారం బాలికల గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని తెలుసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.