
సైన్యం కోరిన 15 ఏళ్ల తర్వాత కొనుగోలు
అమెరికా నుంచి 72 వేలు ఆర్డర్
ఇప్పటికే 10 వేలు ఇండియాకు!
7.4 లక్షల కలాష్నికోవ్ రైఫిళ్లకూ ఆర్డర్
చైనా, పాకిస్థాన్ బార్డర్లలో పహారా కాస్తున్న ఇండియన్ ఆర్మీకి సరికొత్త అసాల్ట్ రైఫిల్స్ రాబోతున్నాయి. అమెరికాకు చెందిన, 500 మీటర్ల దూరం కాల్చగల ఈ రైఫిల్స్ను ఫ్రంట్లైన్ సోల్జర్స్కు ఇవ్వనున్నారు. అమెరికాకు చెందిన సిగ్ సార్ కంపెనీ నుంచి 72,400 రైఫిళ్లను ఈ ఫిబ్రవరిలో ఆర్డర్ చేయగా ఇప్పటికే 10 వేలు వచ్చేశాయని సమాచారం. మిగతా అన్ని రైఫిళ్లు 2020 తొలి నాళ్లలో వచ్చేస్తాయని తెలిసింది. ఈ 7.62×51ఎంఎం కాలిబర్ రైఫిళ్ల కోసం రూ.638 కోట్లను ఖర్చు చేస్తున్నారు. మొత్తం రైఫిళ్లలో 66,400 ఆర్మీకి, 4 వేలు ఐఏఎఫ్కు, 2 వేలు నేవీకి ఇవ్వనున్నారు. ఈ అత్యాధునిక రైఫిళ్లను యుద్ధభూమిలో, క్షేత్రస్థాయిలో ఈజీగా వాడొచ్చు. ఆర్మీ కోరిన 15 ఏళ్ల తర్వాత ఈ రైఫిళ్లు సైనికులకు అందబోతున్నాయి. 2005లో ఆర్మీ తమ దగ్గరున్న 5.56 ఎంఎం ఐఎన్ఎస్ఏఎస్ (ఇండియన్ స్మాల్ ఆర్మ్స్ సిస్టమ్) స్థానంలో అసాల్ట్ రైఫిళ్లను అప్డేట్ చేయాలని కోరింది. 382 ఇన్ఫాంట్రీ బెటాలియన్ల (ఒక్కో బెటాలియన్లో 850 మంది ఉంటారు) కోసం ఆ రైఫిళ్లు అడిగింది.
కలాష్నికోవ్లు ఇండియాలోనే..
రష్యాకు చెందిన కలాష్నికోవ్ రైఫిళ్లను కూడా కొనేందుకు సర్కారు సుముఖత వ్యక్తం చేసింది. ఆ దేశ సహకారంతో ఉత్తరప్రదేశ్లోని కోర్వా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 7.45 లక్షల కలాష్నికోవ్ ఏకే 203 రైఫిళ్లను తయారు చేయనున్నారు. వీటి కోసం రూ. 12 వేల కోట్లను సర్కారు ఖర్చు చేస్తోంది. ఈ 7.62×39 ఎంఎం కాలిబర్ రైఫిళ్లు ఏకే 47ల కన్నా ఉత్తమమైనవి. వీటి రేంజ్ 300 మీటర్లు. 7.45 లక్షల రైఫిళ్లలో ఆర్మీకి 7 లక్షలు, ఐఏఎఫ్కు 29 వేలు, నేవీకి 13,600 అందించనున్నారు. దీనికి సంబంధించి రష్యాతో ఫైనల్ కాంట్రాక్టును వచ్చే ఏడాది కుదుర్చుకోనున్నారు. బడ్జెట్ పరిమితుల వల్ల ఆర్మీలోని కొద్ది మందికే అడ్వాన్స్డ్ రైఫిళ్లను అందిస్తున్నామని ఆర్మీ జనరల్ బిపిన్ రావత్ ఈమధ్య మీడియాతో అన్నారు.
ఇజ్రాయెల్ స్పైక్ మిసైళ్లకూ బేరం
కొత్త రకం రైఫిళ్లతో పాటు ఇజ్రాయెల్ నుంచి 210 స్పైక్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైళ్లను ఇండియా తీసుకోబోతోంది. 12 లాంచర్లను కూడా కొంటోంది. వీటన్నింటినీ పాక్ బార్డర్ దగ్గర పహారాగా ఉన్న సైనికులకు అందించనుంది. వీటితో పాటు 30 స్నైపర్ రైఫిళ్లు, .338 లపువ మాగ్నమ్ స్కార్పియో టీజీటీలు, .50 కాలిబర్ ఎం95 గన్లను ఇప్పటికే తీసుకుంది. 1,500 మీటర్ల నుంచి 1,800 మీటర్ల దూరంలోని లక్ష్యాలను ఇవి ఈజీగా కాల్చేయగలవు. అయితే ఈ కొన్ని రైఫిళ్లు, లాంచర్లు మన అవసరాలను ప్రస్తుతానికి తీర్చలేవు. రక్షణ మంత్రి మాత్రం రైఫిళ్లు, వెపన్స్ లోటును త్వరలోనే పూడుస్తామని, ఇండియన్ కంపెనీలతోనే వెపన్స్ తయారు చేయిస్తామని వెల్లడించారు.