డాక్టర్లతో కలిసి సిజేరియన్​ చేసిన .. అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ

డాక్టర్లతో కలిసి సిజేరియన్​ చేసిన .. అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ

అచ్చంపేట, వెలుగు : మహిళకు సిజేరియన్ చేసి తల్లీబిడ్డల ప్రాణాలు కాపాడారు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్​ వంశీకృష్ణ. నాగర్​ కర్నూల్​ జిల్లా లింగాల మండలం జీలుగుపల్లి గ్రామానికి చెందిన ప్రసన్నకు తొమ్మిది నెలలు నిండినా డెలివరీ కాకపోవడంతో ఆమె బంధువులు అచ్చంపేట హాస్పిటల్​కు తీసుకెళ్లారు. నాగర్​ కర్నూల్​ జిల్లా దవాఖానకు వెళ్లాలని అక్కడి సిబ్బంది సూచించారు. దీంతో వారు శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి అచ్చంపేటలో ఉన్న ఎమ్మెల్యేను కలిసి సమస్యను వివరించారు.

వెంటనే ఎమ్మెల్యే సదరు గర్భిణిని అచ్చంపేట గవర్నమెంట్​ హాస్పిటల్ కు తీసుకెళ్లి అక్కడి వైద్యులతో కలిసి సిజేరియన్​ చేశారు. ఆడపిల్ల జన్మించగా తల్లీ బిడ్డలు క్షేమంగా ఉన్నారని ఎమ్మెల్యే తెలిపారు. కాగా ఎమ్మెల్యే వంశీకృష్ణ సర్జన్. అచ్చంపేట, హైదరాబాద్​, కల్వకుర్తిలో ప్రాక్టీస్  చేశారు. ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్యేను పలువురు అభినందించారు.