ఏపీ రవాణా, సమాచారశాఖ మంత్రి పేర్ని నానిపై ఓ అగంతుకుడు దాడి చేశాడు. అదృష్టవశాత్తు ఆ దాడిలో ఆయనకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. మంత్రి నాని తల్లి నవంబర్ 19న మరణించారు. అందుకు సంబంధించి ఆదివారం నాని తల్లిగారి పెద్దకర్మ మచిలీపట్నంలోని ఆయన నివాసంలో నిర్వహించారు. ఆ కార్యక్రమానికి ప్రజలు కూడా హాజరయ్యారు. వారందరినీ పలకరిస్తుండగా.. ఒక వ్యక్తి ముందుకు దూసుకొచ్చి నాని కాళ్ల మీద పడినట్లుగా వంగి, ఆయన మీద దాడికి ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన మంత్రి సిబ్బంది.. ఆ వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
మంత్రిపై దాడి చేసిన వ్యక్తిని చెమ్మన్నగిరి పేటకు చెందిన బడుగు నాగేశ్వరరావుగా గుర్తించామని సీఐ వెంకటరమణ తెలిపారు. భవన నిర్మాణంలో ఉపయోగించే తాపీని.. ఆయుధంగా మార్చి పొడవడానికి ప్రయత్నించాడని ఆయన తెలిపారు. ఈ దాడి సమయంలో నిందితుడు తాగి ఉన్నాడని సీఐ తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని.. అదేవిధంగా నిందితుడికి గతంలో ఏమైనా నేర చరిత్ర ఉందా అని ఆరా తీస్తున్నామని ఆయన తెలిపారు. నిందితుడిపై మంత్రి అనుచరులు ఫిర్యాదు చేశారని.. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆయన తెలిపారు. ఈ ఘటనతో ఏదైనా పార్టీలకు సంబంధం ఉందా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.
For More News..