వైద్యం వికటించి బాలింత మృతి..డాక్టర్ల నిర్లక్ష్యమేనని బంధువుల ఆరోపణ

వైద్యం వికటించి బాలింత మృతి..డాక్టర్ల నిర్లక్ష్యమేనని బంధువుల ఆరోపణ
  • సూర్యాపేట జిల్లా కోదాడ టౌన్ లో ఘటన

కోదాడ, వెలుగు: వైద్యం వికటించి బాలింత మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది. స్థానికులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. కోదాడ టౌన్ కు చెందిన రాయపూడి వెంకట నారాయణ కుమార్తె హిమబిందు(30) గర్భిణి కాగా.. డెలివరీ కోసం శనివారం   తిరుమల ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. అక్కడే తొలిసారి ఆమె నార్మల్ డెలివరీ అవగా.. ప్రస్తుతం కూడా  అలానే చేయాలని కుటుంబసభ్యులు ఆస్పత్రి డాక్టర్లను కోరారు. 

అదేరోజు రాత్రి 7 గంటల సమయంలో ఆమె నార్మల్ డెలివరీ అయి మగ బిడ్డకు జన్మనిచ్చింది. కాగా.. ఆ సమయంలో హిమబిందుకు అధికంగా బ్లీడింగ్ కావడంతో వెంటనే వైద్య సిబ్బంది ఐసీయూకు తీసుకెళ్లారు. అనంతరం హిమబిందు చనిపోయిందని వైద్య సిబ్బంది చెప్పడంతో బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆస్పత్రిపై దాడి చేశారు. బాలింత మృతికి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. పోలీసులు వెళ్లి మృతురాలి కుటుంబసభ్యులకు నచ్చజెప్పారు. హిమబిందు  తండ్రి వెంకట నారాయణ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కోదాడ పోలీసులు తెలిపారు.