కూకట్పల్లి, వెలుగు: నగరంలో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన ఇద్దరు దొంగలను బాలానగర్ పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని బాలానగర్ ఏసీపీ పి.నరేశ్రెడ్డి తెలిపారు. ఈ నెల 18న బాలానగర్ పరిధిలోని ఐడీపీఎల్ హట్స్ సమీపంలో పార్కింగ్లో నిలిపి ఉంచిన డీసీఎం వ్యాన్ చోరీకి గురైంది.
యజమాని యూసుఫ్బాబా ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాల సహాయంతో కర్నాటక రాష్ట్రం బసవకళ్యాణ్కు చెందిన నలుగురు నిందితులు చోరీ చేసినట్టు గుర్తించారు. వారి నివాసాలపై దాడులు చేసి మహ్మద్ ఖదీర్ (35), మహ్మద్ తాజుద్దీన్ (42)ను అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల సమాచారం మేరకు మహారాష్ట్ర లాతూర్ జిల్లా కోరేలి గ్రామంలో దాచిన డీసీఎం వ్యాన్తో పాటు జనరేటర్ను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న దిగ్య, ఫక్రుద్దీన్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
