- తెలంగాణ భవన్లో హైడ్రామా నడుమ అదుపులోకి తీసుకున్న పోలీసులు
- నాంపల్లి పీఎస్కు తరలించి 8 గంటల పాటు విచారణ
- హిమాయత్నగర్లోని జడ్జి నివాసంలో హాజరుపరిచిన పోలీసులు
- అర్ధరాత్రి దాటిన తర్వాత రిమాండ్పై మొదలైన వాదనలు
- తెలంగాణ భవన్ వద్ద బీఆర్ఎస్ కార్యకర్తల అత్యుత్సాహం
- పోలీసులతో వాగ్వాదం.. లోపలికి వెళ్లకుండా అడ్డగింత
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను నాంపల్లి పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. తెలంగాణ భవన్లో హైడ్రామా మధ్య అదుపులోకి తీసుకున్నారు. భారీ బందోబస్తుతో నాంపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. రాత్రి 8.30 గంటల వరకు పోలీస్ స్టేషన్లోనే విచారించారు. అనంతరం కింగ్కోఠి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యపరీక్షలు నిర్వహించారు.
ఆ తర్వాత రాత్రి 9.30 గంటల సమయంలో హిమాయత్ నగర్లోని నాంపల్లి కోర్టు నివాసంలో హాజరుపరిచారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా రిమాండ్పై వాదనలు కొనసాగాయి.
జూన్ 26న తెలంగాణ భవన్లో జరిగిన టీబీజీకేఎస్ సమావేశంలో పాల్గొన్న బాల్క సుమన్ ప్రభుత్వ ఆస్తుల విధ్వంసానికి కేడర్ను రెచ్చగొట్టిన సంగతి తెలిసిందే. బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని సింగరేణి భవన్ ఎస్ అండ్ పీసీ విభాగం జూనియర్ ఇన్ స్సెక్టర్ బి ఆనంద్ నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
‘హైదరాబాద్ నాంపల్లిలోని సింగరేణి భవన్తో పాటు మందమర్రిలోని సింగరేణి జీఎం ఆఫీస్కు నిప్పుపెట్టి కాల్చేయాలని, రాష్ట్రంలోని సింగరేణి కంపెనీ ఆస్తులను ధ్వంసం చేయడం ద్వారా మిలిటెంట్ చర్యలకు పాల్పడాలని, ఈక్రమంలో ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కోవడానికి ఆర్థిక సహాయం అందిస్తామని బాల్క సుమన్ రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
- నాలుగు రోజులుగా విచారణకు సహకరించలే
సుమన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను ఆనంద్ పోలీసులకు అందించారు. ఈ మేరకు సుమన్ సహా మరికొంత మందిపై సెక్షన్ 326(జీ), 351(3), 353(1)(బి) రెడ్ విత్55 రెడ్ విత్ 61(2)(ఏ), బీఎస్ఎస్ సహా ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ సెక్షన్ 4 కింద నాంపల్లి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రధాన నిందితుడిగా ఉన్న సుమన్కు నోటీసులు ఇచ్చి విచారించేందుకు పోలీసులు ప్రయత్నించారు.
కానీ నాలుగు రోజులుగా ఆయన అందుబాటులో లేకపోవడంతో పాటు విచారణకు సహకరించలేదని తెలిసింది. తీరా సుమన్ తెలంగాణ భవన్లో తలదాచుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అబిడ్స్ ఏసీపీ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో పోలీసులు తెలంగాణ భవన్ చేరుకున్నారు. సుమన్ను అరెస్ట్ చేస్తున్నారనే సమాచారంతో భవన్కు బీఆర్ఎస్ కార్యకర్తలను పెద్ద సంఖ్యలో రప్పించారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
- బీఆర్ఎస్ కార్యకర్తల హంగామా
సుమన్ను అరెస్ట్ చేసే సమయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. పోలీసులు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. భవన్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. పార్టీ లాయర్లు కూడా పోలీసులతో మాట్లాడారు. భారీగా పోలీసులు మోహరించడంతో సుమన్ బయటకు రాక తప్పలేదు. ఆయనను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న సమయంలోనూ కార్యకర్తలు కారుకు అడ్డుపడ్డారు. ముందుకు వెళ్లకుండా హంగామా చేశారు.
అదే సమయంలో సుమన్ మీడియాతో మాట్లాడారు. తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. పార్టీ కేడర్ను, సింగరేణి కార్మికులను హింసవైపు ప్రేరేపించేలా చేసిన మాటలను.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నట్టుగా చూపించుకునే ప్రయత్నం చేశారు. తనను ప్రభుత్వం టార్గెట్ చేస్తున్నదని ఆరోపించారు.
ఇటీవల క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల సమయంలోనూ ఇలాగే అరెస్ట్ చేశారని, అయినా కూడా ప్రశ్నించడం మానుకోనని చెప్పారు. కొందరు తనను జైల్లో పెట్టి పైశాచికానందం పొందాలని చూస్తున్నారన్నారు. సింగరేణిలో వేల కోట్ల స్కాములు నడుస్తున్నాయని, దానిని ప్రశ్నించినందుకే తనను అరెస్ట్ చేశారని విమర్శించారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, పార్టీ కార్యక్రమంలో ఉన్నానని పేర్కొన్నారు.
