- మహారాష్ట్ర సీఎంతో మేం అపాయింట్మెంట్ ఇప్పిస్తం
- సీఎం రేవంత్రెడ్డిపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఫైర్
- గిల్లికజ్జాలతో రాజకీయ లబ్ధి పొందాలని చూడటం దుర్మార్గం
- రాష్ట్రంలో నడుస్తున్నది కరప్షన్, కలెక్షన్, కమీషన్ పాలన
- అందరికీ చాన్స్ ఇచ్చారు.. ఈసారి బీజేపీకి అవకాశం
- ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: మహారాష్ట్ర సీఎం అపాయింట్మెంట్ తీసుకోవడం చేతగాకపోతే ఆ విషయాన్ని ఒప్పుకోవాలని, తాను, కిషన్రెడ్డి ముందుకొచ్చి అపాయింట్మెంట్ ఇప్పిస్తామని సీఎం రేవంత్రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. అనవసరంగా గిల్లికజ్జాలు పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం సరికాదని అన్నారు. ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో, వడ్ల కొనుగోలు అంశంలో వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే సీఎం రేవంత్రెడ్డి కొత్త డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్లోని బీజేపీ స్టేట్ ఆఫీసులో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ.. మహారాష్ట్ర సీఎం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని, ఉప్పెన సృష్టిస్తామని సీఎం రేవంత్ అనడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. గతంలో కాళేశ్వరం విషయంలో మహారాష్ట్ర సహకరించిన విషయాన్ని రేవంత్రెడ్డి మరిచిపోయారా? అని ప్రశ్నించారు. పొరుగు రాష్ట్రాలతో సఖ్యతగా ఉండాలే తప్ప, రాజకీయాల కోసం విభేదాలు సృష్టించడం రాష్ట్ర ప్రయోజనాలకే చేటని అన్నారు. తెలంగాణలో ప్రస్తుతం‘ట్రిపుల్ ఆర్’ కాదు.. ‘ట్రిపుల్ సీ’ సినిమా నడుస్తోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అంటేనే కరప్షన్ , కలెక్షన్ , కమీషన్ అని.. ఈ మూడు సీలతో రాష్ట్ర పాలన సాగుతోందని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజలు పెనం మీద ఉంటే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పొయ్యిలో పడ్డట్లయిందని వ్యాఖ్యానించారు.
బీజేపీ వల్లే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది..
1400 మంది బలిదానాల తర్వాత కూడా కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వలేదని, పార్లమెంట్లో సుష్మా స్వరాజ్ నిలదీస్తేనే రాష్ట్రం ఏర్పడిందని సంజయ్ చెప్పారు. తెలంగాణ బిల్లుపై చర్చ జరుగుతుంటే కేసీఆర్ కనీసం సభకు కూడా రాలేదని విమర్శించారు. రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ కుటుంబం లక్షల కోట్లు దోచుకుందని, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే బాటలో నడుస్తోందని ఆరోపించారు. తెలంగాణ బాగుపడాలంటే కేంద్ర నిధులు అత్యవసరమని, అది కేవలం డబుల్ ఇంజిన్ సర్కార్తోనే సాధ్యమని సంజయ్ స్పష్టం చేశారు. ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం ఉండటంతో నిధులు వెల్లువెత్తుతున్నాయని, ఇక్కడ మాత్రం మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వక, భూసేకరణ చేయక కేంద్ర నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. అందరికీ అధికారం ఇచ్చారని, ఈ సారి బీజేపీకి ఓ అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు.
