
- బీఆర్ఎస్ అవినీతి, కుటుంబ పార్టీ
- అలాంటి పార్టీతో మేం కలిసే ప్రసక్తే లేదు
- కవిత లేఖ పేరిట డ్రామాలు
- కాంగ్రెస్ డైరెక్షన్లో ‘చార్ పత్తా’ సినిమా
- హరీశ్, కేటీఆర్, కవిత, సంతోష్ లీడ్ రోల్స్.. కేసీఆర్ జోకర్
- కాంగ్రెస్ 6 గ్యారంటీల నుంచి ప్రజలను దృష్టి మళ్లించేందుకే ఈ ఎత్తుగడ
- భారత సైన్యం ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా సీఎం రేవంత్ వ్యాఖ్యలున్నాయని ఫైర్
కరీంనగర్, వెలుగు: కవితను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు బీజేపీలో కలవాలని బీఆర్ఎస్ ప్రయత్నించిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కానీ తాము దరిదాపుల్లోకి కూడా రానియ్యలేదని తెలిపారు. ఇప్పుడు కవిత లేఖ పేరిట డ్రామాలాడుతున్నారని, కాంగ్రెస్ దర్శకత్వంలోనే ఇదంతా నడుస్తున్నదని ఆరోపించారు. ‘‘కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ దర్శకత్వంలో చార్పత్తా సినిమా నడిపిస్తున్నరు. ఇందులో హరీశ్, కేటీఆర్, కవిత, సంతోష్ లీడ్ రోల్స్ అయితే.. ఇందులో కేసీఆర్ను జోకర్ ప్లేస్లో పెట్టిన్రు. కాంగ్రెస్ హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నరు” అని ఆయన విమర్శించారు.
కుటుంబ పార్టీలకు బీజేపీ వ్యతిరేకమని.. అలాంటిది బీఆర్ఎస్తో తాము ఎలా కలుస్తామని సంజయ్ ప్రశ్నిం చారు. ‘‘బీఆర్ఎస్ ఓ ఫామ్హౌస్ పార్టీ, కుటుంబ పార్టీ, అవినీతి పార్టీ. మేం పోరాడుతున్నదే కాంగ్రెస్ కుటుంబ పార్టీకి వ్యతిరేకంగా. అలాంటిది బీఆర్ఎస్ కుటుంబ పాలన పార్టీని మేమెందుకు దగ్గరికి తీసు కుంటం. దానితో కలిసే ప్రసక్తే లేదు” అని చెప్పారు. వాళ్లు ఎన్ని డ్రామాలాడినా బీఆర్ఎస్ను దగ్గరికి తీసే ప్రసక్తే లేదని, ఆ పార్టీతో పొత్తు ఊసే ఉండదని స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లాలో శనివారం పలు అభివృద్ధి కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. ‘‘కవితను అరెస్ట్ చేయ కుండా అండాలనే ఉద్దేశంతోని బీజేపీతో కలిసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నించింది.
కానీ, మేం రానియ్యలే. కుటుంబ పాలనకు మేం వ్యతిరేకం” అని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. దీనిపై ప్రజలు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారని, వాళ్ల దృష్టిని మళ్లించేందుకు కొత్త ఎత్తుగడలకు కాంగ్రెస్ నేతలు దిగుతున్నారని దుయ్యబట్టారు. ఈటల రాజేందర్, హరీశ్ రావు భేటీ అయ్యారనే విష యం తనకు తెలియదని ఆయన అన్నారు.
రేవంత్ రెడ్డివి దేశద్రోహ వ్యాఖ్యలు
సీఎం రేవంత్ రెడ్డివి దేశద్రోహ వ్యాఖ్యలని, భారత సైన్యం ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఆయన మాట్లాడా రని బండి సంజయ్ మండిపడ్డారు. ‘‘రేవంత్రెడ్డికి భారత సైన్యంపై, ఆర్మీ చీఫ్పై విశ్వాసం లేదా? ఇందిరా హయాంలో యుద్ధం జరిగితే పాక్ ఆక్రమిత కాశ్మీర్ను ఎందుకు స్వాధీనం చేసుకోలేకపోయారు? అమెరికాలో ట్విన్ టవర్స్పై ఉగ్రవాదులు దాడి చేస్తే 10 ఏండ్లదాకా ఒసామా బిన్ లాడెడ్ను ఆ దేశం పట్టుకోలేకపోయింది.
కానీ పహల్గాం ఘటన జరిగిన 15 రోజుల్లోనే పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకపోయి ఉగ్రవాదులను, ఉగ్రవాద శిబిరాలను మట్టుపెట్టిన గొప్ప చరిత్ర భారత సైన్యానికి ఉంది” అని తెలిపారు. రాష్ట్రంలో వడ్లను పూర్తిగా కేంద్రమే కొనుగోలు చేస్తు న్నదని, గత పదేండ్లలో వడ్ల కొనుగోళ్ల కోసమే దాదాపు రూ. 2 లక్షల 29 వేల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. వేములవాడ రాజన్న ఆలయ పరిధిలో 18 గోవులు చనిపోవడంపై అధికారులు వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.