
- బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్, కమ్యూనిస్టుల
- చీకటి ఒప్పందాలను బయటపెడ్తం
- సింహంలా బీజేపీ సింగిల్గానే పోటీ చేస్తది
- కొలువులు కావాలంటే కమలం రావాల్సిందే
- రాష్ట్రంలో ‘సారు, కారు, 60 పర్సెంట్ సర్కార్’
- ఏం సాధించారని ఈ దశాబ్ది ఉత్సవాలు?
హైదరాబాద్, వెలుగు: కర్నాటక ఎన్నికల ఫలితాలు రాగానే తెలంగాణలో బీజేపీ పనైపోయినట్లు ప్రచారం చేస్తున్నారని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ మండిపడ్డారు. కర్నాటకకు, తెలంగాణకు సంబంధమేంటని ప్రశ్నించారు. ‘‘దుబ్బాక ఉప ఎన్నిక నుంచి మొదలు పెడితే.. జీహెచ్ఎంసీ, హుజూరాబాద్, మునుగోడు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల వరకు ప్రజలు బీజేపీ వైపు నిలిచారు. ఎన్నికల ఫలితాల్లో డిపాజిట్లే రాని కాంగ్రెస్.. బీఆర్ఎస్కు ఏ విధంగా ప్రత్యామ్నాయమవుతుంది?” అని ప్రశ్నించారు.
డిపాజిట్లు రాని కాంగ్రెస్.ప్రత్యామ్నాయమా?
ప్రజలంతా బీజేపీ మాత్రమే బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయమని భావిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్లో ఇప్పుడున్న ఐదుగురు ఎమ్మెల్యేల్లో నలుగురు నాలుగు దిక్కులు చూస్తున్నారని, ఒకాయన మా త్రం చౌరస్తాలో నిలబడి ఏం చేయాలో తెలవకుం డా అయోమయంగా చూస్తున్నారని ఎద్దేవా చేశారు. సోమవారం హైదరాబాద్ శివారులోని చంపాపేట్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. దీనికి అధ్యక్షత వహించిన సంజయ్ ఉదయం ప్రారంభ.. సాయంత్రం ముగింపు ఉప న్యాసం ఇచ్చారు. ‘‘ప్రతిపక్షంగా ఉండాల్సిన కాం గ్రెస్.. లోక్ సభలో బీఆర్ఎస్ తో కలిసే నడుస్తోంది. అసెంబ్లీలో కలిసే పనిచేస్తూ.. ప్రజా సమస్యలను గాలికొదిలేశారు.. కలిసే దోచుకుంటున్నారు. కలిసే భూములను పంచుకుంటున్నారు. వీళ్లా ప్రజలకు ప్రత్యామ్నాయం.. ఆలోచించండి” అని ప్రజలను కోరారు. బీఆర్ఎస్, -కాంగ్రెస్, ఎంఐఎం, కమ్యూనిస్టుల చీకటి ఒప్పందాలను బయటపెడతామని, దుష్ట చతుష్టయ పార్టీలను బజారుకీడుద్దామని పిలుపునిచ్చారు. ‘కొలువులు కావాలంటే కమలం రావాల్సిందే’ అనే నినాదాన్ని పల్లె, పల్లెకు తీసుకెళ్దామన్నారు.
కాంగ్రెస్కు ఫండింగ్ చేస్తుండు
‘‘రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితిపై ఎప్పటికప్పుడు కేసీఆర్ సర్వేలు చేయించుకుంటున్నడు. ఆ పార్టీ సొంతగా అధికారంలోకి రాదని తేలిపోవడంతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు పాకెట్ మనీ పేరుతో ఎన్నికల ఫండింగ్ చేస్తున్నాడు. ఆ పార్టీ అభ్యర్థులు గెలిస్తే వాళ్లంతా బీఆర్ఎస్తో కలిసి అధికారం పంచుకోవాలని చూస్తున్నారు” అని సంజయ్ ఆరోపించారు. ‘‘తెలంగాణ కోసం బొం త పురుగునైనా కౌగిలించుకుంటానన్న కేసీఆర్ అసలు నైజం అది కాదు.. తన స్వార్థం కోసం, తన కుటుంబ ప్రయోజనాల కోసం అదే బొంత పురు గును నమిలి మింగేసే రకం” అని మండిపడ్డారు. ‘‘ఒకనాడు మోడీని విశ్వగురువుగా, నిజాయితీపరుడిగా కీర్తించిన కేసీఆరే.. ఇవ్వాళ అవినీతిపరు డు, రాక్షసుడంటూ తిడుతున్నాడు. బీజేపీని ఓడిం చేందుకు దేశమంతా తిరుగుతూ పైసలు పంచుతున్నాడు. కేసీఆర్ లాంటి నీచుడిని, నా రాజకీయ జీవితంలో చూడలేదు” అని నిప్పులు చెరిగారు.
దుష్ట చతుష్టయం కుట్ర
‘‘తెలంగాణ కోసం మొదటి నుంచి నిలబడి, కలబడి పార్లమెంట్లో బిల్లు పాస్ చేయించిన సుష్మా స్వరాజ్ ను తెలంగాణ చిన్నమ్మ అని సంబోధించిన నోటితోనే దూషించిన నీచుడు. పొత్తు పేరుతో 2004లో కాంగ్రెస్ను, 2009లో టీడీపీని మోసం చేసిండు. 2004లో కమ్యూనిస్టులను తోక పార్టీలని, సూది దబ్బడం పార్టీలని తిట్టిండు. ఇప్పు డేమో తన అవసరం కోసం కమ్యూనిస్టులను చంకనేసుకుని తిరుగుతున్నడు. దేశాన్ని కాంగ్రెస్, నెహ్రూ కుటుంబం మోసం చేస్తే.. ఆ కాంగ్రెస్ ను, ఆ కుటుంబాన్ని మోసం చేసిన ఘనుడు కేసీఆర్. అంతెందుకు.. కర్నాటక ఎన్నికల ముందు వరకు జేడీఎస్కు నిధులు పంపి జట్టు కట్టి మోసం చేసిం డు. తర్వాత కాంగ్రెస్ తో జత కట్టిండు” అని సంజ య్ విమర్శించారు. ‘‘తెలంగాణ ప్రజలకు ప్రధాన విలన్ కేసీఆరే. కాంగ్రెస్.. సైడ్ విలన్ పాత్ర పోషిస్తే.. ఎంఐఎం, కమ్యూనిస్టులు ఆకు రౌడీల టైపు పాత్ర పోషిస్తున్నరు. 2018 నుంచి పెరుగుతున్న బీజేపీ గ్రాఫ్ ను దెబ్బతీసేందుకు దుష్ట చతుష్టయం కుట్ర చేశాయి” అని చెప్పారు.
60 పర్సంట్ కమీషన్ సర్కార్
‘‘దళిత బంధులో ఎమ్మెల్యేలు 30 శాతం కమీషన్లు తీసుకుంటే.. మరో 30 శాతం కమీషన్ సీఎం కుటుంబానికి వెళ్తుంది. కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, సచివాలయ నిర్మాణంతోపాటు భూ దందాల్లోనూ 60 శాతం కమీషన్లు వెళ్తున్నాయి. ఇది అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ కాదు.. సారు, -కారు,- 60 పర్సంట్ సర్కార్’’ అని సంజయ్ ఆరోపించారు. 60 పర్సంట్ సర్కార్ ను ఇంటికి సాగనంపేదాకా పోరాడతామని స్పష్టం చేశారు. ట్రిపుల్ వన్ జీవో రద్దు, కోకాపేట భూముల కేటా యింపు వెనుక కుట్ర ఉందని, దీనిపై లీగల్ సెల్ ద్వారా న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 30 నుంచి వచ్చే నెల 30 వరకు ‘మోడీ తొమ్మిదేండ్ల పాలన’ పై రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు చేపడుతామన్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ సునీల్ బన్సల్, సహ ఇన్చార్జ్ అరవింద్ మీనన్, సీనియర్ నేతలు లక్ష్మణ్, డీకే అరుణ, వివేక్ వెంకటస్వామి, మురళీధర్ రావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఈటల రాజేందర్, ఇంద్రసేనారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఏవీఎన్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లాల అధ్యక్షులు, ఇన్చార్జ్లు పాల్గొన్నారు.
అనుమానమే లేదు.. మెజారిటీ సాధిస్తం
‘‘రాష్ట్రంలో బీజేపీ సింహంలా సింగిల్ గానే పోటీ చేస్తుంది. మెజారిటీ సాధిస్తుంది. అధికారంలోకి వస్తుంది. అనుమానమే లేదు” అని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ‘‘బీఆర్ఎస్ వందల కోట్లు ఖర్చు పెట్టి దశాబ్ది ఉత్సవాల పేరుతో 21 రోజుల పండుగ చేసుకుంటున్నది. ఏం సాధించా రని ఈ దశాబ్ది ఉత్సవాలు? కేసీఆర్ పాలనలో సాధించిందేమిటి? అవినీతి, ఆక్రందనలు, ఆర్తనాదాలు, హత్యలు, అత్యాచారాలు తప్ప.. కేసీఆర్ పాలనలో ఒరింగిందేమిటి?” అని నిలదీశారు. లీకులు,- లిక్కర్-, అప్పుల్లోనే పురోగతి సాధించాడని, ఆ లీకు వీరుడిని, లిక్కర్ రాణి చేసే అక్రమాలను కాపాడేందుకు సీఎం సీటు మీద కూర్చున్నాడని ఎద్దేవా చేశారు.