- పాలసీని సవరించాలని చూస్తున్న ప్రభుత్వం
- దిగుమతులపై ఆధారపడడం తగ్గించేందుకే..
బిజినెస్ డెస్క్, వెలుగు : ఎలక్ట్రిక్ వెహికల్స్లో కీలకమైనది బ్యాటరీ. ఈ బ్యాటరీలను తయారు చేయాలంటే కచ్చితంగా లిథియంపై ఆధారపడాల్సిందే. ప్రపంచమంతా ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు మరలుతున్న వేళ దేశంలో లిథియం గనులను వెతకడంలో స్పీడ్ పెంచాలని ప్రభుత్వం చూస్తోంది. ఇప్పటి వరకు లిథియం కోసం వెతకడానికి, మైనింగ్ చేయడానికి ప్రవేట్ కంపెనీలకు వీలుండేది కాదు. కానీ, ప్రభుత్వం పాత పాలసీకి సవరణలు చేసి ప్రైవేట్ కంపెనీలు కూడా లిథియం గనులను వెతకడానికి వీలుకలిపించాలని మోడీ ప్రభుత్వం చూస్తోంది. గ్రీన్ ఎనర్జీకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం, లిథియం కోసం ఇతర దేశాలపై ఆధారపడాలని అనుకోవడం లేదు.
ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సెషన్లలోనే ఈ పాలసీకి సంబంధించి అనుమతులను పొందే ఆలోచనలో ఉన్నట్టు సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. లిథియం, బెర్లియం, జిర్కోనియంతో కలిపి మొత్తం ఎనిమిది ఖనిజాలను ప్రైవేట్ కంపెనీలు మైనింగ్ చేయకూడదు. ఈ లిస్టులో నుంచి లిథియంకు మినహాయింపు ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ సవరణ వలన ప్రభుత్వ కంపెనీలతో పాటు, ప్రైవేట్ కంపెనీలు కూడా లిథియంను వెలికి తీయడానికి వీలుంటుందని ఈ విషయం తెలిసిన వ్యక్తులు పేర్కొన్నారు. బ్యాటరీ సప్లయ్ చెయిన్లో ఇండియా ఇతర దేశాలపై ఆధారపడకుండా ఉండేలా చేయడానికి ఈ పాలసీ సాయపడుతుందని అన్నారు. ఈ విషయానికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ మైనింగ్స్ సమాధానం ఇవ్వలేదు. లోకల్గానే గ్రీన్ టెక్నాలజీకి అవసరమయ్యే ముడిసరుకులను సేకరించుకోవాలని ఇండియా చూస్తోంది. 2070 నాటికి కార్బన్ ఎమిషన్స్ను జీరో లెవెల్కు తీసుకురావాలని టార్గెట్గా పెట్టుకుంది. ఇందుకోసం క్లీన్ ఎనర్జీలోని అవకాశాలను అందిపుచ్చుకోవాలని అనుకుంటోంది. 2030 నాటికి దేశంలో 500 గిగా వాట్ల కెపాసిటీ ఉన్న క్లీన్ ఎనర్జీని క్రియేట్ చేసుకోవాలని టార్గెట్గా పెట్టుకుంది కూడా. ఇందుకోసం పెద్ద మొత్తంలో బ్యాటరీ స్టోరేజ్లు అవసరమవుతాయనేది గుర్తుంచుకోవాలి.
కర్నాటకలో లిథియం..
ప్రభుత్వ మైనింగ్ కంపెనీలు దక్షిణ కర్నాటకలో చిన్నపాటి లిథియం రిజర్వ్ను గుర్తించాయి. అయినప్పటికీ దేశ అవసరాలను తీర్చడానికి పెద్ద మొత్తంలోని రిజర్వ్లను గుర్తించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం గ్లోబల్ లిథియం అవసరాల్లో మెజార్టీ వాటా ఆస్ట్రేలియా, చిలీ నుంచి వస్తున్నాయి. చైనా అతిపెద్ద లిథియం ప్రాసెసర్గా ఉంది. దేశ లిథియం అయాన్ బ్యాటరీల దిగుమతుల విలువ ఈ ఏడాది మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 54 శాతం (ఏడాది ప్రాతిపదికన) పెరిగి రూ. 14,640 కోట్ల కు చేరుకుంది. ఈ దిగుమతుల్లో 87% వాటా చైనా, హాంకాంగ్ నుంచే ఉన్నాయి. లోకల్గానే కాకుండా ఇతర దేశాల్లో కూడా లిథియం, కోబాల్ట్ ఖనిజాలను వెలికి తీసేందుకు ప్రభుత్వం చర్యలు మొదలు పెట్టింది. నేషనల్ అల్యూమినియం, హిందుస్తాన్ కాపర్, మినరల్ ఎక్స్ప్లోరేషన్ కార్పొరేషన్లు కలిసి ఒక జాయింట్ వెంచర్ను ఏర్పాటు చేశాయి. ఈ జాయింట్ వెంచర్ కంపెనీ విదేశాల్లోని మైన్లను కొనుగోలు చేస్తోంది.