బీసీ రిజర్వేషన్లు పెంచే బాధ్యత బీజేపీదే

బీసీ రిజర్వేషన్లు పెంచే బాధ్యత బీజేపీదే
  • కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచాలి: బీసీ సంఘాలు
  • అఖిలపక్ష నేతలను సీఎం రేవంత్​రెడ్డి ఢిల్లీకి తీసుకెళ్లాలని సూచన
  • సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బీసీ సంఘాల రౌండ్ టేబుల్ మీటింగ్ 

హైదరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్లు పెంచే బాధ్యత కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానిదేనని.. కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం మరింత ఒత్తిడి పెంచాలని బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లను 42 శాతం పెంచిన తర్వాతే స్థానిక  సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన “స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల పెంపు.. భవిష్యత్ కార్యాచరణ” అనే అంశంపై బీసీ సంఘాల నేతలు, బీసీ మేధావులతో రౌండ్ టేబుల్ మీటింగ్ జరిగింది. 

జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్, హైకోర్టు మాజీ సీజే జస్టిస్ ఈశ్వరయ్య, మేధావుల ఫోరం కన్వీనర్, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు, మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి అటెండ్ అయ్యారు. జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు చేసి చేతులు దులుపుపోకుండా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా కులగనణ కంటే ముందే రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లుకు ఆమోదం తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఐఏఎస్  చిరంజీవులు మాట్లాడుతూ.. తమిళనాడు తరహాలో కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్ లో బీసీ రిజర్వేషన్ల బిల్లును చేర్చి బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. 

రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష పార్టీలు, బీసీ సంఘాల మేధావులతో సమావేశమై ముందుకు సాగాలని కోరారు. జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. రిజర్వేషన్ల బిల్లు ఆమోద బాధ్యత బీజేపీ ప్రభుత్వానిదేనని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లి ప్రధానిపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. బిల్లుకు ఆమోదం తెలపాల్సిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అందుకు కృషి చేయటం లేదన్నారు. బీసీల ఓట్లతో గెలిచి బీసీల ప్రయోజనాలకు పాటుపడని రాజకీయ పార్టీలను, నాయకులను వచ్చే ఎన్నికల్లో చిత్తూ చిత్తుగా ఓడిస్తామని ఆయన హెచ్చరించారు.

 త్వరలో  బీసీ సంఘాల మేధావులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ వెల్లడిస్తామన్నారు. మండలి ప్రతిపక్ష నేత మధుసూదనా చారి మాట్లాడుతూ.. పార్టీలు బీసీలకు అన్యాయం చేయాలని తలపెడితే బీసీలంతా పార్టీలకతీతంగా పెద్ద ఎత్తున పోరాడాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో బీసీ కుల సంఘాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ బాలగోని బాలరాజు గౌడ్, మహాత్మా జ్యోతిబాపూలే జయంతి నిర్వహణ కమిటీ చైర్మన్ చిన్న శ్రీశైలం యాదవ్ పాల్గొన్నారు.