రెడ్లకే విలువిస్తరా? ..కాంగ్రెస్​పై పార్టీ బీసీ లీడర్ల ఫైర్​

రెడ్లకే విలువిస్తరా? ..కాంగ్రెస్​పై పార్టీ బీసీ లీడర్ల ఫైర్​
  • మాకు ప్రాధాన్యం ఏది?.. కాంగ్రెస్​పై పార్టీ బీసీ లీడర్ల ఫైర్​
  • టికెట్లపై రాహుల్, ఖర్గే వద్ద తేల్చుకునేందుకు రెడీ
  • సర్వేలు, సాకులు చెప్పి బీసీలకు టికెట్లు తగ్గించే కుట్ర
  • సీనియర్లను కూడా పక్కనబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నయ్​
  • మాట ప్రకారం 34 సీట్లు బీసీలకు కేటాయించాల్సిందే
  • కాంగ్రెస్​ టీం ఓబీసీ లీడర్ల సమావేశంలో నేతల డిమాండ్​

హైదరాబాద్, వెలుగు:  ఎమ్మెల్యే టికెట్ల కోసం హైకమాండ్​తో తాడోపేడో తేల్చుకునేందుకు కాంగ్రెస్​ బీసీ లీడర్లు సిద్ధమవుతున్నారు. పార్టీ హైకమాండ్​ సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నా.. అసలు పార్టీలోనే ఆ సామాజిక న్యాయాన్ని పాటించడం లేదని వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తరతరాల నుంచి రెడ్ల పెత్తనంలోనే పార్టీ నడుస్తున్నదని, ఇప్పుడైనా బీసీలకు న్యాయం జరగకుంటే ఎట్లా అని, రెడ్లకు ఇచ్చిన విలువ బీసీలకు ఇవ్వరా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన హామీ ప్రకారం 34 సీట్లు బీసీలకు ఇచ్చి తీరాల్సిందేనని తేల్చి చెప్తున్నారు. సర్వేలు, సాకులు చెప్పి బీసీలకు ఒక్క సీటు తగ్గించినా ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు.

 ఆదివారం గాంధీభవన్​లో టీం ఓబీసీ నేతృత్వంలోని బీసీ లీడర్లు సమావేశమయ్యారు. బీసీలకు 20 టికెట్లే ఇస్తారన్న చర్చలు, సీనియర్​ బీసీ నేతల టికెట్లకే ఎసరు పెడ్తున్నారన్న కథనాల నేపథ్యంలో బీసీ లీడర్లు భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. సీనియర్​ బీసీ నేతలకు టికెట్​ నిరాకరిస్తే పోరాటం తప్పదని సమావేశంలో అభిప్రాయ పడ్డట్టు తెలిసింది. త్వరలోనే ఢిల్లీకి వెళ్లి రాహుల్​గాంధీ, మల్లికార్జున ఖర్గేను కలిసి తమ డిమాండ్లను వివరించాలని వారు నిర్ణయించారు.సీనియర్​ లీడర్లు మధు యాష్కీ, పొన్నాల లక్ష్మయ్య, పొన్నం ప్రభాకర్​, మహేశ్​కుమార్​ గౌడ్​, కత్తి వెంకటస్వామి, చెరుకు సుధాకర్, సంగిశెట్టి జగదీశ్, మెట్టు సాయి, కొనగాల మహేశ్​ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఒరిజినల్​ కాంగ్రెసోళ్లకు ఇవ్వరా

దశాబ్దాల తరబడి కాంగ్రెస్​ పార్టీనే నమ్ముకున్న లీడర్లను పక్కన పెట్టేస్తున్నారని సమావేశంలో బీసీ నేతలు ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఒరిజినల్​ కాంగ్రెస్​ లీడర్లను కాదని, ఇప్పుడిప్పుడే పార్టీలోకి వస్తున్నోళ్లను అందలం ఎక్కిస్తున్నారంటూ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ‘‘కొత్తోళ్లు అడిగనన్ని సీట్లు ఇచ్చేందుకు ఓకే అంటున్న నేతలు.. బీసీలు అడిగితే మాత్రం ఎందుకు సాకులు చెప్తున్నరు. సర్వేలంటూ బీసీలను పక్కనపెట్టేందుకు పార్టీ రాష్ట్ర నేతలు కుయుక్తులు పన్నుతున్నరు. అలాంటి వారికి చెక్​ పెట్టేలా అధిష్ఠానంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది” అని బీసీ లీడర్ల సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం. బీసీలకు టికెట్లు ఇవ్వకుంటే ఎంత దూరమైనా వెళ్లేందుకు వారు రెడీ అవుతున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. 

సీడబ్ల్యూసీలో బీసీలేరి?

కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ (సీడబ్ల్యూసీ)లో రాష్ట్రం నుంచి ఒక్క బీసీ నేతకూ అవకాశం ఇవ్వకపోవడంపైనా బీసీ లీడర్ల సమావేశంలో చర్చించినట్టు తెలిసింది. ఇటు స్క్రీనింగ్​ కమిటీలో చివరి నిమిషంలో కోమటిరెడ్డి వెంకట్​రెడ్డిని చేర్చడంలో ఆంతర్యమేంటన్న దానిపైనా చర్చ జరిగినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. స్క్రీనింగ్​ కమిటీలో ముగ్గురు రెడ్లకు అవకాశం ఇచ్చి కేవలం ఒక్క బీసీకే అవకాశం ఇవ్వడమేందని నేతలు ప్రశ్నించినట్టు సమాచారం.  

కనుగోలు రిపోర్ట్​పై గరం గరం

సునీల్​ కనుగోలు ఇచ్చిన రిపోర్ట్​పైనా బీసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. దేవరకద్ర, మహబూబ్​నగర్​, ఆదిలాబాద్, మేడ్చల్​, శేరిలింగంపల్లి, నర్సాపూర్, జనగామ వంటి నియోజకవర్గాల్లో బీసీ నాయకత్వం స్ట్రాంగ్​గా ఉన్నా.. గెలిచే పరిస్థితి లేదంటూ సునీల్​ తన రిపోర్టులో పేర్కొన్నట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, ఆయన ఇచ్చిన రిపోర్ట్​ను బీసీ నేతలు సమావేశంలో తూర్పారా పట్టినట్టు  తెలుస్తున్నది. కావాలని బీసీలను విస్మరించేందుకే ఇలాంటి సర్వే రిపోర్టులు ఇప్పిస్తున్నారని మండిపడ్డట్టు సమాచారం. 

ఆయా నియోజకవర్గాలను మళ్లీ రెడ్లకే కట్టబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ‘‘ఇటీవల పార్టీలో చేరిన సీతా దయాకర్​ రెడ్డికి దేవరకద్ర టికెట్​ ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆదిలాబాద్​లోనూ సుజాతను పక్కనపెట్టి.. ఈ మధ్యనే పార్టీలోకి వచ్చిన కంది శ్రీనివాస్​ రెడ్డికి టికెట్​ ఇప్పించేందుకు యత్నిస్తున్నరు. జనగామలో పొన్నాల లక్ష్మయ్యను కాదని.. ఆయన్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కొమ్మూరి ప్రతాప్​రెడ్డికే టికెట్​ఇచ్చే కసరత్తులు జరుగుతున్నాయి. ఇది ఏ మాత్రం సరికాదు’’ అని సమావేశంలో బీసీ లీడర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. మిగతా నియోజకవర్గాల్లోనూ ఓసీలకే టికెట్లు ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్టు వారు ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. 

మాట నిలబెట్టుకోవాలి: మధుయాష్కీ

కాంగ్రెస్​ ముఖ్యనేత రాహుల్​ గాంధీ, పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్పినట్టు అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు కాంగ్రెస్​ పార్టీ 34 సీట్లు ఇవ్వాల్సిందేనని, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్​ మధుయాష్కీ గౌడ్​ అన్నారు. పొలిటికల్​ అఫైర్స్​ కమిటీ, ఎలక్షన్​ కమిటీ సమావేశాల్లోనూ బడుగులకు సీట్ల కేటాయింపుపై అదే విషయం చెప్పారని గుర్తు చేశారు. ఆదివారం టీం ఓబీసీ లీడర్ల సమావేశం అనంతరం ఆయన.. పలువురు బీసీ లీడర్లతో కలిసి గాంధీభవన్​లో మీడియాతో మాట్లాడారు.

 మహిళా బిల్లులో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కోటాను చేర్చాలంటూ రాహుల్​ గాంధీ చెప్పారని, దానిపై సమావేశంలో కృతజ్ఞతా తీర్మానం చేశామని తెలిపారు. సర్వేల మీద ఆధారపడి ఎన్నికలు జరగవని, బహుజనుల పాత్ర లేకుండా ప్రభుత్వం ఏర్పాటు కాదని తేల్చిచెప్పారు. సర్వేలే ప్రామాణికం అనుకుంటే గతంలో కొందరు సీనియర్లూ ఓడిపోయారని గుర్తు చేశారు. కాంగ్రెస్​ పార్టీ బలపడడంలో బీసీల పాత్ర ఎక్కువన్నారు. బీసీలకు టికెట్లు ఇచ్చే విషయంపై ఢిల్లీలో ఖర్గే, రాహుల్, పీసీసీ చీఫ్​ రేవంత్​, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను కలుస్తామని తెలిపారు. 

సామాజిక సమీకరణాలు పాటించినప్పుడే పార్టీకి లాభం జరుగుతుందన్నారు. ‘‘అగ్రవర్ణ లీడర్లు కూడా కొంచెం ఆలోచించాలి. బీసీ ఓటర్ల సపోర్ట్​ లేకుంటే గెలుపు సాధ్యం కాదు” అని సూచించారు. మరోసారి నిర్వహించే స్క్రీనింగ్​ కమిటీ సమావేశంలో బీసీ లీడర్లకు టికెట్లపై చర్చిస్తామన్నారు. సెంట్రల్​ ఎలక్షన్​ కమిటీ భేటీలోనూ చర్చిస్తామని ఆయన చెప్పారు. గెలుపోటముల నేపథ్యంలో అధికార బీఆర్​ఎస్​, ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలకు టికెట్లను సర్దుబాటు చేయాల్సి వస్తుందని, అది తప్పదని అన్నారు. బీసీ నేతలు నష్టపోకుండా వారికి సర్దుబాటు చేయాలని పేర్కొన్నారు.