- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్
పంజాగుట్ట, వెలుగు : ప్రైవేట్ యూనివర్సిటీల్లో జరగుతున్న దోపిడీని అరికట్టాలంటే వాటిని రద్దు చేసి, ప్రభుత్వ యూనివర్సిటీల్లో కలపాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్లూఎస్ నేతలు డిమాండ్ చేశారు. ప్రైవేట్డీమ్డ్యూనివర్సిటీలపై ప్రభుత్వ అజమాయిషీ లేకపోవడంతో ఇష్టానుసారంగా ఫీజుల దోపిడీకి పాల్పడుతున్నాయని ఆరోపించారు.
సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు భూక్య సంజీవ్ నాయక్ అధ్యక్షతన నిర్వహించిన మీడియా సమావేశానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, మాల సంఘాల జేఏసీ అధ్యక్షుడు మందాల భాస్కర్, చైర్మన్చెరుకు రాంచందర్, మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ అధ్యక్షుడు సోమశేఖర్, రాములు యాదవ్, ఈబీసీ జేఏసీ చైర్మన్ వల్లపురెడ్డి రవిందర్ రెడ్డి హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. ప్రైవేట్ యూనివర్సిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నించారు. దళిత బహుజన సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 13న విద్యా దోపిడీపై విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి, ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని పేర్కొన్నారు.
7న బెంగళూరు డిక్లరేషన్
సైఫాబాద్ : దేశవ్యాప్తంగా బీసీల రాజకీయ, సామాజిక హక్కుల సాధనకు దిశానిర్దేశం చేసే బెంగళూరు డిక్లరేషన్ ను ఈ నెల 7న బెంగళూరులో జరిగే 11వ జాతీయ ఓబీసీ మహాసభలో ప్రకటించనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సభకు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వేలాది మంది ఓబీసీ ప్రతినిధులు హాజరవుతారన్నారు.
సోమవారం సైఫాబాద్ లోని బీసీ భవన్ లో రచయిత సుద్దాల అశోక్ తేజ రచించిన చలో బెంగళూరు ఓబీసీ జాతీయ గీతం ఆడియోను విడుదల చేశారు. సంఘం కన్వీనర్ గుజ్జ కృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ కుల్కచర్ల శ్రీనివాస్, నాయకులు పాల్గొన్నారు.
