
- వీఐపీల విమానాల రాకపోకలను దుండిగల్కు మార్చాలి
- బేగంపేట ఎయిర్పోర్టుకు అనుసంధానంగా ఉన్న కాలనీ, బస్తీవాసుల విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: పౌర విమానయాన శాఖ విడుదల చేసిన రాజపత్రంపై కంటోన్మెంట్ కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ నుంచి వికాస్ మంచ్ యూనియన్ అభ్యంతరాలు పంపిస్తున్నట్లు ఆ సంఘం ప్రతినిధులు తెలిపారు. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదంతో అలర్ట్ అయిన ఏవియేషన్ శాఖ.. ఇలాంటి ప్రమాదాలు భవిష్యత్తులో జరగకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించింది. అందులో భాగంగా హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్ పోర్టు చుట్టూ ఉండే కాలనీలకు కొన్ని ప్రతిపాదనలతో కూడిన గెజిట్ రిలీజ్ చేసింది. బేగంపేట్ఎయిర్ పోర్ట్ చుట్టూ ఉన్న మల్టీ ఫ్లోర్ బిల్డింగ్లు (బహుళ అంతస్తులు), చెట్లను తొలగించనున్నట్లు గెజిట్ (రాజపత్రం) విడుదల చేసింది.
ఇందుకు ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే 60 రోజుల్లో తెలియజేయాలని కోరింది. ఈ అంశంపై కాలనీ వాసులతో శుక్రవారం వికాస్ మంచ్ యూనియన్ సమావేశం నిర్వహించింది. బేగంపేట ఎయిర్ పోర్ట్ కు అనుసంధానంగా ఉన్న కాలనీలు, బస్తీల్లో కూడా ఈ రూల్స్ అమలు చేస్తే .. కాలనీల్లోని బహుళ అంతస్తుల భవనాలు కూల్చవలసిన పరిస్థితి ఉంటుందని.. చాలా ఏండ్లుగా ఇక్కడ కాలనీలు, సొసైటీలు డెవలప్ అయ్యాయని అన్నారు. ఉన్నట్లుండి ఇప్పుడు కూల్చేస్తామంటే లక్షల మంది నష్టపోతారని అన్నారు.
ఇలాంటి ఇబ్బందులు ఉంటాయని తెలిసే బేగంపేట్ నుంచి మార్చి శంషాబాద్ ఎయిర్ పోర్టు నిర్మించారని తెలిపారు. ప్రస్తుతం బేగంపేట్ ఎయిర్ పోర్టులో రాష్ట్రపతి, మంత్రులు, అధికారులు, సైనిక విమానాలే ఆగుతున్నాయని.. కాలనీ వాసుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని దుండిగల్ కు మార్చాలని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా బేగంపేట ఎయిర్ పోర్ట్ ల్యాండ్ ను ప్రభుత్వానికి కేటాయిస్తే నిరుపేదలకు ఇండ్లు కట్టించే అవకాశం దక్కుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.