
ఇప్పుడేది కొనాలన్నా.. ఆన్ లైన్ షాపింగ్ ఉందిగా అంటారు. ఆన్లైన్షాపింగ్తో టైం, డబ్బు కలిసొస్తున్నప్పటికీ, మోసాలు కూడా బాగానే జరుగుతున్నాయి. తాజాగా బెంగళూరులో ఓ మహిళ రూ. 800 విలువైన కుర్తా కొనేందుకు ఆన్లైన్లో షాపింగ్ చేసిన పాపానికి.. కొన్ని నిమిషాల్లోనే 79 వేల రూపాయలను పొగొట్టుకుంది! సిటీలోని గొట్టిగెరెకు చెందిన శ్రావణ అనే మహిళ ఈ నెల 8న తన ఫోన్లో ఒక ఈ–కామర్స్ యాప్ను డౌన్ లోడ్ చేసుకుంది. దాని ద్వారా ఓ కుర్తాకు ఆర్డర్ చేసింది. కానీ చెప్పిన టైంకి ఆర్డర్ ఇంటికి రాలేదు. దీంతో ఆ యాప్లో ఉన్న కస్టమర్కేర్కు ఫోన్ చేసింది. ఆమె ఆర్డర్ చేసిన వస్తువు త్వరలోనే వచ్చేస్తుందని కస్టమర్ కేర్ వ్యక్తి నుంచి రిప్లై వచ్చింది. అంతేకాకుండా, ఏవేవో మాటలు చెప్పి, ఆన్లైన్లో ఓ ఫామ్ ఫిల్ చేయాలని చెప్పాడు. ఆమె అడిగిన వివరాలన్నీ ఆమె ఆన్లైన్లో నింపింది. చివరగా ఓటీపీ నెంబర్ అడిగితే అది కూడా చెప్పింది. ఆ తర్వాత కొన్ని నిమిషాల్లోనే.. ఆమె మొబైల్ ఫోన్కు వరుసగా వచ్చిన మెసేజ్ లు చూషి షాకయ్యింది. వెంటవెంటనే నాలుగు విడతల్లో రూ. 79 వేలు ఆమె అకౌంట్ నుంచి మాయమైపోయాయి. దీంతో మోసపోయానని తెలుసుకున్న ఆమె చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. గూగుల్ ప్లేస్టోర్, ఐవోఎస్ స్టోర్లలో కూడా ఫ్రాడ్ యాప్లు ఉంటాయని సైబర్ క్రైమ్ నిపుణులు చెబుతున్నారు. అందుకే అఫీషియల్ యాప్ లను మాత్రమే డౌన్ లోడ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. స్మార్ట్ ఫోన్లలో ‘ప్లే ప్రొటెక్ట్’ ఫీచర్ను వాడితే యాప్లను అది చెక్ చేస్తుందని సూచించారు.