బిల్డర్స్.. సంపద సృష్టికర్తలు ..  వాళ్లకు సహాయక సహకారాలను అందిస్తం: భట్టి

బిల్డర్స్.. సంపద సృష్టికర్తలు ..  వాళ్లకు సహాయక సహకారాలను అందిస్తం: భట్టి
  • సంపదను సృష్టించే సంస్థలను ప్రోత్సహించడం ప్రభుత్వాల బాధ్యత
  • పెట్టుబడులకు తెలంగాణ అన్ని రకాలుగా అనుకూలం
  • బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కన్వెన్షన్‌‌లో కామెంట్స్ 

హైదరాబాద్, వెలుగు:  కాంగ్రెస్ ప్రభుత్వం బిల్డర్స్‌‌‌‌‌‌‌‌ను కాంట్రాక్టర్లుగా చూడటం లేదని, సంపద సృష్టికర్తలుగా చూస్తున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కాంట్రాక్టర్లను కాపాడుకొని ప్రోత్సహిస్తామని భరోసా ఇచ్చారు. ఆదివారం హైటెక్స్‌‌‌‌‌‌‌‌లో జరిగిన బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 31వ కన్వెన్షన్‌‌‌‌‌‌‌‌కు ముఖ్య అతిథిగా భట్టి హాజరయ్యారు. రెండో రోజు కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన ప్రారంభించారు. కన్వెన్షన్ వద్ద ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాల్స్‌‌‌‌‌‌‌‌ను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ‘బిల్డింగ్ త్రూ టైం’, ‘టెక్నికల్ వాల్యూమ్’ పుస్తకాలను ఈ సందర్భంగా ఆవిష్కరించారు.

తర్వాత ఆయన మాట్లాడుతూ.. నిర్మాణరంగంలో తెలుగు రాష్ట్రాల కాంట్రాక్టర్లు కీలకపాత్ర పోషిస్తున్నారని, సంపదను సృష్టించడంలో ముందున్నారని తెలిపారు. ఇలాంటి వారిని ప్రోత్సహించడం ప్రభుత్వాల బాధ్యత అని చెప్పారు. ‘‘దేశంలో సంక్షేమ రాజ్యం అమలు కావాలంటే సంపద కావాలి. సంపద సృష్టించే సంస్థలు వచ్చినప్పుడే ప్రజల సంక్షేమ అవసరాలను ప్రభుత్వాలు తీర్చగలుగుతాయి. అలాంటి సంస్థలను ఇబ్బందిపెట్టే ఆలోచన ఇందిరమ్మ రాజ్యంలో ఉండదు. దేశంలో నిర్మాణ రంగం ఎన్నో విప్లవాత్మక మార్పులతో చాలా ముందుకు దూసుకుపోతున్నది” అని భట్టి వివరించారు. తెలంగాణకు వచ్చి సంపద సృష్టించే వారికి కావాల్సిన సహాయ సహకారాలు ఇందిరమ్మ రాజ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు. 

బిల్స్ రాక ఇబ్బందిపడుతున్నరు

బ్యాంకు గ్యారంటీలు, లోన్లు తెచ్చుకొని నిర్మాణ రంగంపై పెట్టుబడి పెట్టిన సంస్థలకు సకాలంలో బిల్లులు రాకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. ఒకప్పుడు మార్కెట్లో ఒక వెలుగు వెలిగిన ప్రముఖ నిర్మాణ రంగ సంస్థలు ఆర్థిక ఇబ్బందుల కారణంగా కనిపించకుండా పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ చాలా అందమైన నగరమని, పెట్టుబడులకు అనువైన ప్రాంతమని వివరించారు. తెలంగాణ రాష్ట్రం వాతావరణ పరంగా, ఆర్థికపరంగా, భాష పరంగా అందరికీ అనువుగా ఉంటుందని, ఇక్కడికి వచ్చి స్థిరపడి వ్యాపారాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పారు.

బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు ఎస్.ఎన్ రెడ్డి, చైర్మన్ బి.శ్రీనయ్య మాట్లాడుతూ.. పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా గత ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందని అన్నారు. దీంతో చాలామంది కాంట్రాక్టర్లు ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు రావాల్సిన బకాయిలను వీలైనంత త్వరగా ఇప్పించాలని కోరారు. ఇరిగేషన్ ప్రాజెక్టులను కట్టే కాంట్రాక్టర్లకు అందించే పన్ను మినహాయింపులను, రాయితీలను భవన నిర్మాణ కాంట్రాక్టర్లకు కూడా ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరీ సచితానంద రెడ్డి, రాష్ట్ర చైర్మన్ దేవేందర్ రెడ్డి, కో వైస్– చైర్మన్ డి.వి.ఎన్ రెడ్డి, నేషనల్ కన్వెన్షన్ చైర్మన్ ఆర్.రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.