- ‘భేనిశాన్’ ద్వారా రూ.151 కోట్ల వ్యాపారం
- 1.09 లక్షల మంది మహిళా రైతులకు లబ్ధి
- రాష్ట్ర వ్యాప్తంగా 84 రైతు ఉత్పత్తిదారుల సంఘాలు
హైదరాబాద్, వెలుగు: సెర్ప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘భేనిశాన్’ రైతు ఉత్పత్తిదారుల సమాఖ్య (ఎఫ్పీసీ) రాష్ట్రంలోని మామిడి రైతులకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వనపర్తి జిల్లా పెబ్బేరు గ్రామానికి చెందిన రైతు బాలకృష్ణ దంపతులు ఈ సీజన్లో ‘మల్లిక రకం’ మామిడి పండ్లను విదేశాలకు ఎగుమతి చేయడం చిన్న రైతులకు కొత్త ఆశలు నింపింది. దీంతో ఇప్పటివరకు మామిడి రైతులకు రూ.151 కోట్ల వ్యాపారం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ విధానం ద్వారా రైతులకు అదనంగా 15 నుంచి 20 శాతం వరకు అధిక ఆదాయం లభిస్తోందన్నారు. గతంలో చిన్న, సన్నకారు రైతులు తక్కువ పంట ఉత్పత్తి చేయడంతో పెద్ద వ్యాపారులు వారిని పట్టించుకునే పరిస్థితి ఉండేదికాదు. దీంతో దళారులకు తక్కువ ధరలకు అమ్ముకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఎఫ్పీసీల ద్వారా రైతుల ఉత్పత్తులను సమీకరించి పెద్ద మార్కెట్లకు విక్రయించడం వల్ల రైతులకు మద్దతు ధర లభిస్తోంది.
దిగ్గజ సంస్థలతో ఒప్పందాలు..
రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 84 రైతు ఉత్పత్తిదారుల సంస్థలు పనిచేస్తున్నాయి. 30 జిల్లాలు, 404 మండలాలు, 3,072 గ్రామాల్లో ఈ నెట్వర్క్ విస్తరించి ఉంది. ఇందులో మొత్తం 1.09 లక్షల మంది సన్న, చిన్నకారు రైతులు సభ్యులుగా ఉండగా, వారిలో అత్యధికంగా మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు ఉండడం విశేషం. గతంలో చిన్న రైతులు తక్కువ విస్తీర్ణంలో పండించిన పంటను ఎగుమతి చేయడం అసాధ్యంగా ఉండేది. కానీ ‘భేనిశాన్’ ద్వారా సమీకరణ, గ్రేడింగ్, ప్యాకింగ్ సదుపాయాలు కల్పించడంతో అంతర్జాతీయ మార్కెట్లకు మార్గం సుగమమైంది. రిలయన్స్, ఫ్లిప్కార్ట్, బిగ్బాస్కెట్, మెట్రో క్యాష్ అండ్ క్యారీ, మోర్, స్టార్ బజార్, రత్నదీప్ వంటి ప్రముఖ రిటైల్ సంస్థలతోపాటు పలు అగ్రో ప్రాసెసింగ్ కంపెనీలతో సెర్ప్ ఒప్పందాలు కుదుర్చుకుంది.
