లక్నో: కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి అలహాబాద్ హైకోర్టులో భారీ ఊరట దక్కింది. రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయాలని కోరుతూ దాఖలైన ఓ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా పోలీసులకు ఆదేశాలు ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది.
అసలు వివాదం ఏంటంటే..?
2025లో న్యూఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాహుల్ గాంధీ బీజేపీ దాని మాతృసంస్థ ఆర్ఎస్ఎస్పై విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని హిందూ శక్తి దళ్కు చెందిన సిమ్రాన్ గుప్తా ట్రయల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా ఆదేశాలు ఇచ్చేందుకు నిరాకరించిన ట్రయల్ కోర్టు సిమ్రాన్ గుప్తా పిటిషన్ను తోసిపుచ్చారు.
దీంతో ట్రయల్ కోర్టు తీర్పును సిమ్రాన్ గుప్తా అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన అలహాబాద్ హైకోర్టు సిమ్రాన్ గుప్తా పిటిషన్ను కొట్టివేసింది. బీజేపీ, ఆర్ఎస్ఎస్పై విమర్శల అంశంలో రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా ఆదేశాలు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. హైకోర్టు తీర్పుతో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్ దక్కింది.
