
- మొదటి దశలో 121, రెండో దశలో 122 స్థానాలకు ఓటింగ్
- 14న కౌంటింగ్, అదేరోజు ఫలితాలు
న్యూఢిల్లీ, వెలుగు: బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. రెండు విడతల్లో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. సోమవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సింధు, వివేక్ జోషితో కలిసి ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్.. బిహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఈసీ మాట్లాడుతూ నవంబర్ 6న తొలి విడత, అదే నెల 11న రెండో విడత పోలింగ్ జరుగుతుందన్నారు. మొదటి దశలో 121 అసెంబ్లీ స్థానాలకు, రెండో దశలో 122 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు.
నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేసి, ఫలితాలు వెల్లడిస్తామన్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు తరువాతే వీవీప్యాట్, ఈవీఎంల లెక్కింపు చేపడతామన్నారు. ఈసీఐనెట్ యాప్తో ఎప్పటికప్పుడు ఎన్నికల సరళి గురించి అప్డేట్ చేస్తామని చెప్పారు. పోలింగ్ సమయంలో ప్రతి 2 గంటలకు ఒకసారి ఈ యాప్లో ఓటింగ్ డేటా అప్డేట్ అవుతుందని వివరించారు. పోలింగ్ స్టేషన్ల వద్ద మొబైల్ డిపాజిట్ కౌంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్లను కొత్తగా ఇవ్వనున్నామని, ఆ స్లిప్స్పై ఓటరు ఐడి నంబర్ స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు.
ఎస్ఐఆర్తో 68.5 లక్షల ఓట్లు తొలగించాం
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) చేపట్టిన తరువాత జరుగుతున్న తొలి ఎన్నికలు బిహార్ అసెంబ్లీవేనని జ్ఞానేశ్ కుమార్ తెలిపారు. ఎస్ఐఆర్తో బిహార్లో 68.5 లక్షల ఓటర్లను తొలగించామని, 21.5 లక్షల మంది కొత్త ఓటర్లను జాబితాలో చేర్చామన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియతో బిహార్ ఓటర్ల జాబితాను పరిశుభ్రం చేసినట్లు చెప్పారు. నామినేషన్లకు 10 రోజుల ముందు కూడా ఓటర్లు మార్పులు చేసుకోవచ్చని సూచించారు. తుది ఓటరు జాబితా ప్రకటించామని, ఒకవేళ ఎవరైనా అప్పీల్ చేసుకోవాలనుకుంటే, నామినేషన్కు పది రోజుల ముందు వరకు చేసుకోవచ్చని వివరించారు.
పారదర్శకంగా నిర్వహిస్తం..
బిహార్ అసెంబ్లీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. 7.43 కోట్ల మంది బిహారీ ఓటర్లలో 3.92 కోట్ల మంది పురుషులు, 3.51 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారని తెలిపారు. మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకుంటున్న ఓటర్లు 14 లక్షలు ఉన్నారని వెల్లడించారు. ఎలాంటి ఫిర్యాదులకైనా 1950 నంబర్కు ఓటర్లు డయల్ చేయొచ్చని తెలిపారు. ఏ పోలింగ్ కేంద్రంలోనూ 1,200 మందికి మించి ఓటర్లు ఉండరని, తాజా సవరణతో బిహార్లో పోలింగ్ కేంద్రాలు 90,712కి పెరిగాయన్నారు. కాగా.. 243 స్థానాలు కలిగిన బిహార్ అసెంబ్లీకి నవంబర్ 22తో గడువు ముగియనుంది. ఈలోగా కొత్త ప్రభుత్వం కొలువుదీరాలి. 2020లో మూడు విడతల్లో పోలింగ్ నిర్వహించగా.. అంతకుముందు 5 విడతల్లో పోలింగ్ నిర్వహించారు. ఈసారి మాత్రం 2 విడతల్లోనే పోలింగ్ నిర్వహించనున్నారు.
11న ఎనిమిది చోట్ల బై పోల్స్
బిహార్ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 8 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 11న బై పోల్స్ జరగనున్నాయి. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. రాజస్తాన్, తెలంగాణ, పంజాబ్, మిజోరం, జార్ఖండ్, ఒడిశా, జమ్మూకాశ్మీర్లో ఈ నియోజకవర్గాలు ఉన్నాయి. ఒమర్ అబ్దుల్లా రాజీనామా, దేవేందర్ సింగ్ రాణా మరణంతో జమ్మూకాశ్మీర్ లో 2, కన్వర్ లాల్ మీనాపై అనర్హత వేటుతో రాజస్తాన్లో 1, మిగతా రాష్ట్రాల్లో నేతల మరణాలతో 5 సీట్లు ఖాళీ అయ్యాయి.
షెడ్యూల్ ఇదే.. తొలి దశ మలి దశ
121 122
నోటిఫికేషన్ అక్టోబర్ 10 అక్టోబర్ 13
నామినేషన్ల గడువు అక్టోబర్ 17 అక్టోబర్ 20
పరిశీలన అక్టోబర్ 18 అక్టోబర్ 21
ఉపసంహరణ అక్టోబర్ 20 అక్టోబర్ 23
పోలింగ్ నవంబర్ 6 నవంబర్ 11