రైతులను బీజేపీ, బీఆర్‌‌‌‌ఎస్‌‌ పట్టించుకోలే : ఎంపీ వంశీకృష్ణ

రైతులను బీజేపీ, బీఆర్‌‌‌‌ఎస్‌‌ పట్టించుకోలే : ఎంపీ వంశీకృష్ణ
  •  వారి పాలనలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నరు 
  • ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ సర్కార్ రైతు రుణమాఫీ చేసింది
  • జైపూర్‌‌‌‌లో రుణమాఫీ సంబురాల్లో పాల్గొన్న పెద్దపల్లి ఎంపీ

కోల్​బెల్ట్/జైపూర్, వెలుగు: రాష్ట్రంలో గత బీఆర్‌‌‌‌ఎస్ సర్కార్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ఎలాంటి సహాయం చేయలేదని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. గురువారం సాయంత్రం మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం టేకుమట్ల రైతు వేదిక వద్ద రైతు రుణమాఫీ సంబురాల్లో ఎంపీ వంశీకృష్ణ పాల్గొని, మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ చేసిందని చెప్పారు. 

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు కచ్చితంగా అండగా ఉంటామని, ఎన్ని కష్టాలు వచ్చిన ఆదుకుంటామని గత ఎన్నికల ప్రచారంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మాట ఇచ్చారని గుర్తుచేశారు. వరంగల్ రైతు డిక్లరేషన్‌‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను సీఎం రేవంత్ రెడ్డి నెరవేర్చుతున్నారని చెప్పారు. 

రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందని తెలిసినా సోనియా గాంధీ రాష్ట్ర ప్రజల అకాంక్షలను నెరవేర్చేందుకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారన్నారు. తెలంగాణ ఉద్యమంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కీలకంగా వ్యవహరించారని, తన కూతురు పెండ్లి మరో రెండ్రోజుల్లో ఉందనగా వివేక్‌‌ను జైలుకు పంపించారని గుర్తుచేశారు. 

బీఆర్‌‌‌‌ఎస్, బీజేపీ రైతు ద్రోహుల పార్టీ..

రాష్ట్రంలో బీఆర్‌‌‌‌ఎస్, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాల హయంలో తీసుకున్న అప్పులకు వడ్డీలు కట్టలేక దేశవ్యాప్తంగా వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వంశీకృష్ణ ఆరోపించారు. బీఆర్‌‌‌‌ఎస్, బీజేపీ రైతు ద్రోహ పార్టీలని మండిపడ్డారు. గత పదేండ్లలో రైతులకు ఏమీ చేయని కేసీఆర్‌‌‌‌.. రాష్ట్రాన్ని మాత్రం రూ.7 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చారని ఫైర్‌‌‌‌ అయ్యారు. తన కుటుంబం, ప్రైవేటు కంపెనీల లబ్ధి కోసమే ఆయన పనిచేశారని ఆరోపించారు.

 రూ.లక్ష కోట్ల ప్రజల సోమ్మును కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో దుర్వినియోగం చేశారన్నారు. బీజేపీ సర్కార్ బడా వ్యాపారవేత్తలకు మాత్రమే రూ.వేల కోట్ల రుణాన్ని మాఫీ చేసింది తప్ప.. రైతులను ఏనాడు పట్టించుకోలేదన్నారు. మోదీ పాలనలో దేశవ్యాప్తంగా బ్రిడ్జిలు, ఎయిర్‌‌‌‌ఫోర్ట్‌‌లు కూలిపోతున్నాయన్నారు. అంతకు ముందు ఎంపీ వంశీకృష్ణ, రైతులు, కాంగ్రెస్ లీడర్లతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌‌ను వీక్షించారు. 

ఎల్‌‌ఐసీని ప్రైవేటీకరణ చేయకుండా ఒత్తిడి తీసుకరావాలని కోరతూ ఎంపీ వంశీకృష్ణకు కాంగ్రెస్ లీడర్ ముక్త శ్రీనివాస్, ఎల్‌‌ఐసీ ఎజెంట్లు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ లీడర్లు చల్ల సత్యనారాయణరెడ్డి, ఫయాజ్, శ్రీనివాస్ రెడ్డి, విశ్వంభర్​రెడ్డి, పీఏసీఎస్​ చైర్మన్ గుండు తిరుపతి, గొనె నర్సయ్య, 
మండల అగ్రికల్చర్ ఆఫీసర్ మార్క్ గ్లాడ్ తదితరులు పాల్గొన్నారు.