హైదరాబాద్, వెలుగు: కొన ఊపిరితో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊపిరి పోయడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కవితను ఈడీతో అరెస్ట్ చేయించిందని పీసీసీ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ ఆరోపించారు. ఇది బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కై జరుపుతున్న డ్రామా అని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఇన్ని రోజులు ఎలాంటి స్పందన లేకుండా ఉన్న ఈడీ, ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడానికి ఒక రోజు ముందు కవితను అరెస్టు చేయడం.. బీఆర్ఎస్పై సానుభూతిని పెంచడానికేనని విమర్శించారు. ఒకవైపు మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గంలో ప్రధాని మోదీ రోడ్ షో నిర్వహిస్తుంటే, అదే సమయంలో కవితను అరెస్టు చేసేందుకు స్కెచ్ గీశారని ఎద్దేవా చేశారు.