మరో 6 ఎంపీ స్థానాలకు బీజేపీ అభ్యర్థులు ఖరారు

మరో 6 ఎంపీ స్థానాలకు బీజేపీ అభ్యర్థులు ఖరారు
  • సెకండ్ లిస్ట్​లోనూ బీఆర్ఎస్ మాజీ నేతలకు ప్రాధాన్యం
  • మహబూబ్ నగర్- డీకే అరుణ.. మెదక్- రఘునందన్ రావు 
  • ఆదిలాబాద్- గోడం నగేశ్​ 
  • మహబూబాబాద్ -సీతారాం నాయక్ 
  • నల్గొండ- సైదిరెడ్డి, పెద్దపల్లి- గోమాస శ్రీనివాస్​ 

న్యూఢిల్లీ, వెలుగు: దేశవ్యాప్తంగా 72 లోక్​సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తూ బీజేపీ రెండో జాబితా రిలీజ్​ చేసింది. తెలంగాణలోని మరో ఆరు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మహబూబ్ నగర్– డీకే అరుణ, మెదక్– రఘునందన్ రావు, ఆదిలాబాద్– గోడం నగేశ్​, మహబూబాబాద్-– సీతారాం నాయక్, నల్గొండ– సైదిరెడ్డి, పెద్దపల్లి– గోమాస శ్రీనివాస్ కు అవకాశం కల్పించింది. 

తెలంగాణలో మొత్తం 17 లోక్​సభ స్థానాలు ఉండగా.. తొలి లిస్ట్​లో 9 స్థానాలకు, తాజా లిస్ట్ లో 6 స్థానాలకు బీజేపి అభ్యర్థులను ప్రకటించింది. కాగా ఖమ్మం, వరంగల్ స్థానాలను పెండింగ్ లో పెట్టింది. బుధవారం పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ మొత్తం 72 మందితో కూడిన సెకండ్ లిస్ట్ ను రిలీజ్ చేశారు. కర్నాటక 20, మహారాష్ట్ర 20, గుజరాత్ 7, హర్యానా 6, తెలంగాణ 6, మధ్య ప్రదేశ్ 5, హిమాచల్ ప్రదేశ్ 2, ఢిల్లీ 2, ఉత్తరాఖండ్ 2, త్రిపుర 1, దాద్రానగర్ హవేలీ 1 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. లోక్ సభలో మొత్తం 543 స్థానాలు ఉండగా.. బీజేపీ ఇప్పటి వరకు సొంతంగా 267 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. 195 మందితో ఫస్ట్ లిస్ట్, 72 మందితో తాజాగా సెకండ్​ లిస్ట్​ను విడుదల చేసింది.

సెకండ్ లిస్ట్​లోనూ ముగ్గురు బీఆర్ఎస్​ మాజీలే

సెకండ్ లిస్ట్​లోనూ బీఆర్ఎస్ మాజీ  నేతలకు బీజేపీ​ అధిష్టానం ప్రాధాన్యం ఇచ్చింది. మొత్తం ఆరు స్థానాలను ప్రకటించగా.. ఇందులో ముగ్గురు బీఆర్ఎస్ మాజీలే కావడం గమనార్హం. తొలి జాబితాలోనూ మొత్తం 9 మందికి అవకాశం కల్పించగా.. బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఐదుగురికి చాన్స్ ఇచ్చింది. ఇందులో సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములు, బీబీ పాటిల్ ఉన్నారు. 

సిట్టింగ్ ఎంపీ రాములు బీజేపీలో చేరగా.. ఆయన కుమారుడు పోతుగంటి భరత్​కు నాగర్ కర్నూల్ సీటు కేటాయించింది. ఫస్ట్ లిస్ట్ లో మాదిరిగానే.. సెకండ్ లిస్ట్​కు రెండ్రోజుల ముందు పార్టీలో చేరిన నేతలకు అవకాశం కల్పించింది. బీజేపీ పార్లమెంటరీ పార్టీ బోర్డు మీటింగ్ (సీఈసీ) కు ముందు బీఆర్ఎస్ మాజీ ఎంపీలు సీతారాం నాయక్, జి.నగేశ్, మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి, కాంగ్రెస్ నేత శ్రీనివాస్ గోమాస పార్టీలో చేరారు. వీరితో పాటు ఖమ్మం సీటు ఆశిస్తూ.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్ కూడా పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే, జలగం వెంకట్రావ్ మినహా మిగిలిన నలుగురి పేర్లను బీజేపీ సెకండ్ లిస్ట్ లో ప్రకటించింది. గాయకుడు, రచయిత మిట్టపల్లి సురేందర్ కు పెద్దపల్లి అభ్యర్థిగా చివరి వరకు ఆశ చూపి.. లిస్ట్ లో శ్రీనివాస్ గోమాసకు అవకాశం ఇచ్చింది. 

మహబూబ్ నగర్ సీటు అరుణకే 

ఎట్టకేలకు మహబూబ్ నగర్ స్థానాన్ని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ దక్కించుకున్నారు. తొలి నుంచి ఈ స్థానానికి అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, పార్టీ సీనియర్ నేత శాంతి కుమార్ పోటీపడగా.. కోర్ గ్రూప్ మీటింగ్ లో స్వయంగా అరుణ, జితేందర్​ పేర్లను అమిత్ షా పక్కన పెట్టారు. అయితే ఫస్ట్ లిస్ట్ లోనూ వీరి పేర్లు లేకపోవడంతో.. ఆ సీటు తమకే దక్కుతుందని ఇద్దరు నేతలు ధీమా వ్యక్తం చేశారు.  

అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉండటం, ప్రచారంలో తనవంతు పాత్ర పోషిస్తూ వస్తోన్న  డీకే అరుణవైపే అధిష్టానం మొగ్గుచూపింది. మరోవైపు మెదక్ స్థానంపై కూడా భిన్న స్వరాలు వినిపించాయి. తొలి నుంచి ఈ స్థానానికి దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందర్ రావు పోటీ పడుతున్నారు.అందుకు తగ్గట్టుగానే మొదట ఆయన పేరే వినిపించినా.. మధ్యలో అంజిరెడ్డి పేరు తెరపైకి రావడంతో చర్చ మొదలైంది. బుధవారం ప్రకటించిన సెకండ్ లిస్ట్ లో రఘునందన్ కే మెదక్ సీటు దక్కింది.

సెకండ్ లిస్ట్​లో కీ పర్సన్స్ 

సెకండ్ లిస్ట్ లో హర్యానా మాజీ సీఎం మనోహర్ లాట్ ఖట్టర్, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, అనురాగ్ ఠాకూర్, పీయూష్ గోయల్, సిట్టింగ్ ఎంపీ తేజస్వీ సూర్యకు బీజేపీ అవకాశం కల్పించింది. మనోహర్ లాల్ ఖట్టర్ కర్నాల్ నుంచి బరిలో నిలిచారు. గడ్కరీ మరోసారి నాగ్ పూర్ నుంచి పోటీ చేయనున్నారు. ఫస్ట్ లిస్ట్​లో గడ్కరీ పేరు లేకపోవడం చర్చకు దారితీసింది. పీయూష్ గోయల్ – ముంబై నార్త్, తేజస్వి సూర్య – బెంగళూరు సౌత్, బసవరాజ్ బొమ్మై – హవేరి, అనిల్ బలూనీ – గర్హ్వాల్ నుంచి పోటీ లో ఉన్నారు. క్రికెటర్, మాజీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఈస్ట్ ఢిల్లీ సీటు నుంచి హర్ష్ మల్హోత్రాకు పార్టీ అవకాశం కల్పించింది. 

క్లారిటీ రాని ఖమ్మం, వరంగల్ 

హస్తం పార్టీకి బలమైన స్థానంగా కనిపిస్తోన్న ఖమ్మంలో అభ్యర్థి కోసం బీజేపీ వేట సాగిస్తున్నది. ఇటీవల పార్టీలో చేరిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జలగంకు సీటు ఫైనల్ అని అంతా భావించినా.. సెకండ్ లిస్ట్ లో ఆయన పేరు ప్రకటించలేదు. దీంతో ఆ స్థానం నుంచి ఎవరిని బరిలో దింపుతారన్న ప్రశ్న మొదలైంది. ఈ స్థానానికి సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి కూడా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. 

వరంగల్ విషయంలో హైడ్రామా నడుస్తున్నది. బీజేపీలో ఆరూరి రమేశ్ చేరిక ఫైనల్ అని ప్రచారం సాగగా.. చివరి నిమిషంలో బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి ఎంట్రీతో సీన్ మారింది. అలాగే ఈ స్థానం నుంచి మాజీ ఐపీఎస్ కృష్ణ ప్రసాద్ పేరును బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన కీలక నేత బలపరుస్తున్నట్టు సమాచారం.