మర్రి శశిధర్​ రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానించిన నడ్డా

మర్రి శశిధర్​ రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానించిన నడ్డా

సీనియర్​ రాజకీయ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డిని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీలోకి  ఆహ్వానించారు.  ఆయన చేరికతో తెలంగాణలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని జేపీ నడ్డా ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకుముందు ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రి శర్వానంద సోనోవాల్ ఆధ్వర్యంలో మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరారు. అనంతరం కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి,  బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్​, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు  వివేక్ వెంకటస్వామి, లక్ష్మణ్, డీకే అరుణ, పలువురు పార్టీ నేతలతో కలిసి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసానికి మర్రి శశిధర్​ రెడ్డి వెళ్లారు. ఈసందర్భంగా జేపీ నడ్డా బీజేపీ కండువా కప్పి మర్రి శశిధర్​ రెడ్డిని పార్టీలోకి స్వాగతం పలికారు.  

టీఆర్ఎస్​కు బుద్ధి చెప్పడం బీజేపీతోనే సాధ్యం : మర్రి శశిధర్ రెడ్డి

తెలంగాణ ప్రజలు మంచి సర్కారును కోరుకున్నరు.. కానీ అది రాలేదని శశిధర్ రెడ్డి అన్నారు.  మొత్తం ప్రపంచంలో ఇంత అవినీతిమయ ప్రభుత్వం ఎక్కడా లేదని ఆరోపించారు. గత ఎనిమిదిన్నర ఏళ్లుగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్​ ఫెయిల్​ అయిందన్నారు.  మోడీ నాయకత్వంలో దేశం ముందుకు వెళుతోందని ... తాను ఎంతో ఆలోచించాకే బీజేపీలో చేరానన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్​కు బుద్ధి చెప్పడం బీజేపీతోనే సాధ్యమవుతుందని, ఇలాంటి  ఘట్టంలో భాగస్వామ్యం అవుతున్నందుకు తనకు  సంతోషంగా ఉందన్నారు.  బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానన్న శశిధర్ .. రాష్ట్రంలో బీజేపీ సర్కారు ఏర్పాటుకు ప్రాణాలు అర్పించడానికి కూడా  సిద్ధమేనన్నారు.