
- అలా ఎలా అడుగుతారు?
- బీజేపీ నేతలపై జాజుల ఫైర్
హైదరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్లు 42 శాతం పెంచే అధికారం ఉన్నా రిజర్వేషన్లు పెంచకుండా బీసీలకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తున్నదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. బీసీల విషయంలో బీజేపీ ద్వంద ప్రమాణాలు పాటిస్తున్నదని మంగళవారం ఒక ప్రకటనలో ఆయన మండిపడ్డారు. బీసీల రిజర్వేషన్లు పెంచే అధికారం కేంద్రానికే ఉందని, ఈ విషయం తెలిసి కూడా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఎలా అడుగుతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఆ పార్టీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డిని ఆయన నిలదీశారు.
బీసీ రిజర్వేషన్లు పెంచితేనే ఆ పార్టీని రాష్ర్ట ప్రజలు నమ్ముతారని చెప్పారు. కాగా.. కేబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని జాజుల పేర్కొన్నారు కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షంతో కెళ్లి ప్రధానిని కలవాలని డిమాండ్ చేశారు.