
సీఎం కేసీఆర్ కు దమ్ముంటే రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు రావాలని బీజేపీ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ సవాల్ విసిరారు. ఎన్నికలు పెడితే గోల్కొండ ఖిల్లాపై బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ పటాన్ చెరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. శివరాత్రి జాగరణ పేరుతో పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సినీ ఆర్టిస్టులతో హిందూ ధర్మాన్ని అపహస్యం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా బీజేపీ సిద్ధంగా ఉందని..గతంలో కంటే చాలా బలపడిందన్నారు.
పటాన్ చెరులో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పాపాల రెడ్డిగా మారాడని నందీశ్వర్ గౌడ్ విమర్శించారు. మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసిన మహిపాల్ రెడ్డి 2 కోట్ల నుంచి 2 వేల కోట్లకు ఎదిగాడని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో డబ్బులతో ఓటుకు 20 నుండి 30 వేలు ఇచ్చి ధనరాజకీయం చేయాలనుకుంటున్నారని చెప్పారు. ప్రజలు సరైన వ్యక్తిని గెలిపిస్తారని, ఎమ్మెల్యే మహిపాల్ పట్ల విసుగు చెందారని అన్నారు.ఎమ్మెల్యే, తన సోదరుడు దౌర్జన్యాలకు పాల్పడుతూ అక్రమంగా భూములను కాజేస్తున్నారన్నారు. శివరాత్రి పేరిట సినీ ఆర్టిస్టులను పిలిపించి సనాతన ధర్మాన్ని ఎమ్మెల్యే భ్రష్టు పట్టించారని మండిపడ్డారు.పాపాల రెడ్డిపై త్వరలోనే కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపి చర్యలు తీసుకోవడం ఖాయమన్నారు.