గోదావరిఖని, బెల్లంపల్లి, రామకృష్ణాపూర్, వెలుగు : రామగుండం కార్పొరేషన్పై బీజేపీ జెండా ఎగిరి తీరుతుందని మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి అన్నారు. బుధవారం గోదావరిఖని శివాజీ నగర్లో ఎన్నికల కార్యాలయాన్ని ఆర్టీసీ మాజీ చైర్మన్ సోమారపు సత్యనారాయణతో కలిసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పాలనలో రామగుండం కార్పొరేషన్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. కేవలం కమీషన్ల కోసమే ఆరాట పడ్డారు తప్ప సమస్యల్ని పట్టించుకోలేదన్నారు. కేంద్రం ఇచ్చిన రూ.19 కోట్లతోనే కొంత అభివృద్ధి జరిగిందన్నారు. మున్సిపల్ మంత్రి హోదాలో కేటీఆర్ ఇక్కడ పర్యటించి అనేక హామీలిచ్చారని, అందులో ఏదీ చేయలేదన్నారు. మున్సిపల్ మంత్రిగానూ ఆయన ఫెయిలయ్యారన్నారు. వివిధ పథకాల నిధులన్నీ కాళేశ్వరం ప్రాజెక్టుకు మళ్లించి వాటినే కమీషన్ల రూపంలో జేబులు నింపుకున్నారన్నారు. ఇప్పుడు ఆ డబ్బుతోనే మున్సిపల్ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారన్నారు. రామగుండంలో బీజేపీ పుంజుకుందని, సత్తా చూపడమే మిగిలుందన్నారు. కార్పొరేషన్లోని 50 డివిజన్లలో బీజేపీ అభ్యర్థులు పోటీలో ఉంటారని, కలసికట్టుగా పనిచేసి వాళ్లను గెలిపించుకోవాలని ఆర్టీసీ మాజీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్.కుమార్, కార్పొరేషన్ ఏరియా అధ్యక్షుడు బల్మూరి అమరేందర్రావు, పి.మల్లికార్జున్, మాజీ కార్పొరేటర్లు కోదాటి ప్రవీణ్, ధరణి జలపతి, కత్తెరమల్ల రమేశ్, నాయకులు పెద్దపల్లి రవీందర్, క్యాతం వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధి రామకృష్ణాపూర్ బీజేపీ ఆఫీస్లో ఏర్పాటు చేసిన పార్టీ మీటింగ్లోనూ వివేక్ మాట్లాడారు. తర్వాత బైక్ ర్యాలీ నిర్వహించారు.
బీజేపీకి కేటీఆర్ ఒక్క రూపాయీ ఇవ్వలే
బెల్లంపల్లి మున్సిపాలిటీకి మంత్రి కేటీఆర్ రూ.15 కోట్లు ఇస్తానని మాటిచ్చారని, పాలకవర్గం గడువు ముగిసినా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని వివేక్ ఆరోపించారు. హామీలిచ్చి మర్చిపోవడం సీఎం కేసీఆర్కు, మంత్రి కేటీఆర్కు అలవాటైందన్నారు. బుధవారం బెల్లంపల్లిలోని బజార్ ఏరియాలో బీజేపీ ఆఫీస్ను ప్రారంభించిన తర్వాత మాట్లాడుతూ.. టీఆర్ఎస్ నాయకులు బెల్లంపల్లిలో వ్యాపారులను బెదిరిస్తున్నారని, ఎవరికీ భయపడొద్దని, బీజేపీ అండగా ఉంటుందన్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన టీఆర్ఎస్కు ఈ ఎన్నికల్లో ఓట్లడిగే హక్కులేదన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే మరిన్ని నిధులు తెచ్చి అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. బెల్లంపల్లి బజార్ ఏరియాలో పాదయాత్ర నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి, బెల్లంపల్లి మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి దేవేందర్, రాజమొగిళిగౌడ్, బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్చార్జి కొయ్యల ఏమాజీ, బీజేపీ బెల్లంపల్లి పట్టణ అధ్యక్షుడు మునిమంద రమేష్ పాల్గొన్నారు.