రాష్ట్రంలో బీజేపీ బాగా పుంజుకుంది : ఈటల

రాష్ట్రంలో బీజేపీ  బాగా పుంజుకుంది : ఈటల

గజ్వేల్/జగదేవ్​పూర్​, వెలుగు : రాష్ట్రంలో బీజేపీ బాగా పుంజుకుందని ఆ పార్టీ నేత ఈటల రాజేందర్  అన్నారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో కూడా సత్తా చాటుతామని, ఇందుకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని నాయకులు, కార్యర్తలకు ఆయన పిలుపునిచ్చారు. గురువారం గజ్వేల్​ నియోజకవర్గంలోని వర్గల్, జగదేవ్​పూర్​లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోలేదని, గతంలో ఎన్నడూలేని విధంగా ఓట్లు, సీట్లు సాధించిందన్నారు.

ఈసారి ఏకంగా 8 స్థానాలు పొందడంతో పాటు 19 సీట్లలో గట్టి పోటీ ఇచ్చామని చెప్పారు. 46 స్థానాల్లో డిపాజిట్లు దక్కాయన్నారు. ఈసారి ఏకంగా 15  శాతంతో 35 లక్షల ఓట్లు సాధించామని తెలిపారు. ఇవన్నీ రాష్ట్రంలో బీజేపీ సాధించిన విజయాలే అన్నారు. అలాగే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తామన్నారు. గజ్వేల్​లో కేసీఆర్​ డబ్బు, మద్యంతో గెలిచారని ఆయన ఆరోపించారు. గజ్వేల్ లో ఎన్నికలు పారదర్శకంగా జరగలేదన్నారు.