గెలిచినా.. ఓడినా పార్టీ మారబోమని, హైకమాండ్ మాట జవదాటబోమని అభ్యర్థులతో దేవుని సాక్షిగా ప్రమాణం చేయించుకున్న తర్వాతే అభ్యర్థులకు బీజేపీ లీడర్లు బీ-ఫామ్ లు ఇచ్చారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మున్సిపాలిటీలోఈ ఘటన జరిగింది. హుజూరాబాద్ మున్సిపాలిటీలో బీజేపీ నేతలు, ఆ పార్టీ అభ్యర్థులను పట్టణ సమీపంలోని పాటిమీద ఆంజనేయ స్వామి గుడికి రప్పించారు. అక్కడ ప్రత్యేక పూజలు చేయించిన అనంతరం అభ్యర్థులతో పార్టీ మారబోమంటూ దేవుడి మీద ప్రమాణం చేయించుకున్నాకే బీఫామ్లు అందజేయడం గమనార్హం.
కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కార్పొరేటర్ అభ్యర్థులతో కేంద్ర మంత్రి బండి సంజయ్ గత రెండు రోజులుగా వినూత్న రీతిలో ప్రతిజ్ఞ చేయిస్తున్నారు.
గెలిచిన తరువాత పార్టీని వీడబోనని, పార్టీకి అంకిత భావంతో పనిచేస్తానని, కరీంనగర్ అభివృద్ధితోపాటు దేశం కోసం, సమాజం కోసం పనిచేస్తానని ప్రమాణం చేయించారు. కోతిరాంపూర్ చౌరస్తా, పాత లేబర్ అడ్డా వద్ద నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో.. 9, 39. 40, 62, 63, 64 డివిజన్లలో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థులతో ప్రతిజ్ఞ చేయించారు.
