
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తన ఆమరణ నిరసన దీక్షను విరమించారు. ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వం వైఫల్యాలకు నిరసనగా ఆయన 5 రోజుల కింద దీక్ష ప్రారంభించారు. బాధిత విద్యార్థులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం దిగొచ్చేవరకు తన నిరసన కొనసాగుతుందని చెప్పిన లక్ష్మణ్.. ఆహారం, నీళ్లు ముట్టుకోకుండా నిమ్స్ హాస్పిటల్ లో దీక్ష కొనసాగించారు. గురువారం ఆయన ఆరోగ్యం విషమించింది. పార్టీ పెద్దలు, డాక్టర్ల సూచనతో… దీక్ష విరమించారు.
నిమ్స్ హాస్పిటల్ లో డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్న లక్ష్మణ్ కు ప్రతిరోజు నాయకులు పరామర్శించారు. ఈ ఉదయం లక్ష్మణ్ ను కేంద్ర మంత్రి హన్ రాజ్ గంగారాం ఆహిర్ పరామర్శించారు. జనం కోసం లక్ష్మణ్ ఎంతో సేవ చేయాల్సి ఉందని.. ఈ పరిస్థితుల్లో దీక్ష కొనసాగిస్తే ప్రాణాలకే ప్రమాదమని ఆయన లక్ష్మణ్ కు సూచించారు. విద్యార్థులకు న్యాయం జరిగేంతవరకు బీజేపీ పోరాటం కొనసాగుతుందని… దీక్ష విరమించాలని లక్ష్మణ్ ను కోరారు. ఆయనకు నిమ్మరసం అందించి దీక్ష విరమింపజేశారు హన్స్ రాజ్.