
మే 1న క్యాలెండర్ మాత్రమే కాదు.. మన రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసే చాలా అంశాల్లో మార్పు రానుంది.. ATM విత్ డ్రా చార్జెస్ నుంచి రైలు టికెట్ వరకు చాలా మార్పులు అమల్లోకి రానున్నాయి. ఇటీవల రిజర్వ్ బ్యాంకు రెపో రేటు తగ్గించటంతో హోమ్ లోన్స్ వడ్డీ రేట్లు తగ్గనున్నాయి.. 11 రాష్ట్రాల్లో బ్యాంకు విలీనాలు ఇతర రంగాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఏప్రిల్ 30న కొన్ని ITR ఫారమ్ల నోటిఫికేషన్ తర్వాత పన్ను ట్యాక్స్ పేయర్స్ మే నెలలో కూడా తమ ఆదాయపు పన్ను రిటర్న్లను ఫైల్ చేయచ్చు.
ATM విత్ డ్రాల్స్:
మే 1 నుండి ATM ఇంటర్చేంజ్ ఫీజుల పెంపునకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. వేరే బ్యాంకు కస్టమర్లు తమ ATM సేవలను ఉపయోగించినప్పుడు ఈ ఛార్జీని బ్యాంకు చెల్లిస్తుంది. నెలవారీ లిమిట్ మించిన లావాదేవీలకు ఇప్పుడు రూ. 23కు పెరగనుంది. ఏప్రిల్ 30 వరకు ఈ ఛార్జి రూ. 21గా ఉంది. మెట్రో నగరాల్లో నెలకు మూడు ఉచిత ATM లావాదేవీలు, మెట్రోయేతర ప్రాంతాలలో ఐదు ఉచిత ATM లావాదేవీలు మాత్రమే చేసుకునేందుకు వీలు ఉంటుంది.
గ్యాస్ సిలిండర్ ధర:
ఏప్రిల్ నెల ప్రారంభంలో ఎల్పిజి సిలిండర్ల ధర రూ. 50 పెరిగింది. - ఇది ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద యూనిట్కు రూ.550గా ఉంది. ఉజ్వలయేతర ధరను సిలిండర్కు రూ.853కి పెంచింది ప్రభుత్వం. ప్రభుత్వం ఇప్పుడు ప్రతి 15 రోజులకు ఒకసారి ఎల్పిజి ధరలను సమీక్షిస్తుందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. అధికారిక ప్రకటన చేయనప్పటికీ, మే నెలలో ఎల్పిజి ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
FD రేట్లు:
కొన్ని బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లను సవరించి, మే 1 నుండి కొత్త పాలసీలను ప్రకటించాయి. RBL బ్యాంక్లోని సేవింగ్స్ ఖాతాదారులకు ఇప్పుడు గరిష్టంగా 7% రేటుతో నెలవారీ వడ్డీ (త్రైమాసికంగా కాకుండా) అందనుంది. శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ FD రేట్లు మార్చినట్లు తెలిపింది... సీనియర్ సిటిజన్లు ఇప్పుడు సంవత్సరానికి 0.50% అదనపు వడ్డీ అందనుందని.. మహిళా డిపాజిటర్లు సంవత్సరానికి 0.10% అదనపు వడ్డీని అందనున్నట్లు తెలిపింది.
ఇన్కం ట్యాక్స్ రిటర్న్స్:
2025-26 అసెస్మెంట్ ఇయర్ (AY) కి సంబంధించిన ITR ఫారమ్లు 1, 4 లను ఏప్రిల్ 30న అధికారికంగా నోటిఫై చేసింది ఆదాయపు పన్ను శాఖ. మొత్తం వార్షిక ఆదాయం రూ. 50 లక్షల కంటే తక్కువ ఉన్న పన్ను చెల్లింపుదారులు, సంస్థలు తమ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయచ్చు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ కూడా మే నెల మొదటి కొన్ని రోజుల్లో మిగిలిన ఫారమ్లను నోటిఫై చేస్తుందని భావిస్తున్నారు.
బ్యాంకు విలీనాలు
ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రారంభించిన 'ఒక రాష్ట్రం, ఒక RRB' విధానం మే 1 నుండి అమల్లోకి వస్తుంది. నిబంధనల మార్పు 11 రాష్ట్రాలలోని 15 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను ఒకే RRBగా విలీనం చేయనుంది. దీని వలన ఆయా బ్యాంకుల మొత్తం సంఖ్య 43 నుండి 28కి తగ్గుతుంది. ప్రభావితమైన రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, గుజరాత్, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా మరియు రాజస్థాన్ ఉన్నాయి.