న్యూఢిల్లీ:
రష్యా నుంచి క్రూడాయిల్ దిగుమతులను తగ్గించుకోవడానికి ఇండియా రెడీ అవుతోంది. ఈ నెల చివరి నుంచి లేదా డిసెంబర్ స్టార్టింగ్ నుంచి రష్యా ఆయిల్ దిగుమతులు భారీగా పడిపోనున్నాయి. రష్యన్ కంపెనీలు రోస్నెఫ్ట్, లుకోయిల్పై అమెరికా విధించిన ఆంక్షలు ఈ నెల 21 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ దేశం నుంచి నేరుగా క్రూడ్ ఆయిల్ దిగుమతులను తగ్గించుకోవాలని ఇండియా చూస్తోంది. ఇండియన్ రిఫైనరీ కంపెనీలు రిలయన్స్ ఇండస్ట్రీస్, మంగళూరు రిఫైనరీ, హెచ్పీసీఎల్ మిట్టల్ ఎనర్జీ లిమిటెడ్ ఇప్పటికే రష్యా ఆయిల్ కొనుగోళ్లు నిలిపేస్తామని ప్రకటించాయి.
కాగా, ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో ఇండియా దిగుమతి చేసుకున్న 1.8 మిలియన్ బ్యారెల్స్ పర్ డే (బీపీడీ) రష్యన్ ఆయిల్లో సగం వాటా ఈ మూడు కంపెనీలదే ఉంది. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ కంపెనీ క్లెప్లర్ డేటా ప్రకారం, డిసెంబర్ నుంచి రష్యా ఆయిల్ దిగుమతులు గణనీయంగా తగ్గనున్నాయి. అయితే వచ్చే ఏడాది ప్రారంభంలో మధ్యవర్తులు, ఆల్టర్నేటివ్ ట్రేడింగ్ రూట్ల ద్వారా పుంజుకోవచ్చు. రోస్నెఫ్ట్కు వాటాలనున్న నయారా ఎనర్జీ, ఈ కంపెనీ సబ్సిడరీ వడినార్ రిఫైనరీ మాత్రం తమ రష్యన్ ఆయిల్ కొనుగోళ్లను కొనసాగించే అవకాశం ఉంది.
అమెరికా నుంచి జూమ్
అమెరికా ఆంక్షలతో ఈ ఏడాది అక్టోబర్ 21 తర్వాత నుంచి రష్యా ఆయిల్ కొనుగోళ్లను కంపెనీలు తగించేశాయి. అయితే రష్యన్ ఆయిల్ కొనుగోళ్లు పూర్తిగా ఆగిపోవని ఎనలిస్టులు భావిస్తున్నారు. కానీ భవిష్యత్తులో కొనుగోళ్లు క్లిష్టంగా మారచ్చొని, మధ్యవర్తుల నుంచి రష్యా ఆయిల్ దిగుమతులు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. మరోవైపు మిడిల్ఈస్ట్, యూఎస్, లాటిన్ అమెరికా, వెస్ట్ ఆఫ్రికా నుంచి ఆయిల్ కొనుగోళ్లను ఇండియా పెంచుకుంటోంది.
ఈ ఏడాది అక్టోబర్లో అమెరికా నుంచి 5.68 లక్షల బీపీడీ (బ్యారెల్స్ పర్ డే) దిగుమతయ్యాయి. 2021 మార్చి తర్వాత ఇదే అత్యధిక స్థాయి. రానున్న క్వార్టర్లో ఇది 2.5–3.5 లక్షల బీపీడీ స్థాయికి తగ్గే అవకాశం ఉంది. అయితే, రవాణా ఖర్చులు పెరగడం వలన రష్యా నుంచి అమెరికా, లాటిన్ అమెరికా దేశాలకు మారడం కష్టం కావొచ్చని ఎనలిస్టులు భావిస్తున్నారు.
