- బీసీ గురుకులాల ప్రిన్సిపల్స్కు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశం
హైదరాబాద్, వెలుగు: వంద శాతం ఫలితాలే లక్ష్యంగా బీసీ గురుకుల టీచర్స్, ప్రిన్సిపల్స్ పని చేయాలని ఆ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. గతేడాది ఆశించిన స్థాయిలో ఫలితాలు రాని స్కూళ్లు ఈసారి మెరుగైన ప్రదర్శన చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. రిజల్ట్స్ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా సంబంధిత అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్ పరీక్షలు సమీపిస్తున్నందున మహాత్మా జ్యోతిబాపూలే (ఎంజేపీ) బీసీ సంక్షేమ గురుకులాల పనితీరుపై మంత్రి సీరియస్ అయ్యారు.
బీసీ సంక్షేమ శాఖ సెక్రటరీ శ్రీధర్, బీసీ గురుకుల సెక్రటరీ సైదులు, ప్రిన్సిపల్స్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లతో శుక్రవారం మంత్రి జూమ్ మీటింగ్ నిర్వహించి, విద్యార్థుల ప్రిపరేషన్, ఉత్తీర్ణత శాతంపై కీలక ఆదేశాలు జారీ చేశారు. చదువులో వెనుకబడిన 3,142 మంది పదవ తరగతి విద్యార్థులను, 2,021 మంది ఇంటర్ విద్యార్థులను ఉపాధ్యాయులు దత్తత తీసుకొని, వారి కోసం స్పెషల్ క్లాసులు, స్టడీ అవర్స్ నిర్వహించాలని మంత్రి సూచించారు.
