- ఇండియా-ఎ వన్డే కెప్టెన్గా తిలక్ వర్మ
న్యూఢిల్లీ: గాయం నుంచి కోలుకున్న స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ మళ్లీ నేషనల్ టీమ్లోకి వచ్చాడు. సౌతాఫ్రికాతో సొంతగడ్డపై జరిగే రెండు టెస్టుల సిరీస్ కోసం సీనియర్ సెలెక్షన్ కమిటీ బుధవారం (నవంబర్ 05) ప్రకటించిన జట్టులో పంత్ తిరిగి చోటు దక్కించుకున్నాడు. కానీ, సీనియర్ పేసర్ మహ్మద్ షమీని సెలెక్టర్లు మరోసారి పక్కన పెట్టడం చర్చనీయాంశమైంది. గత జులైలో ఇంగ్లండ్తో జరిగిన నాలుగో టెస్టులో పాదానికి గాయమైన కారణంగా ఇంటర్నేషనల్ క్రికెట్కు దూరమైన 26 ఏండ్ల పంత్ పూర్తిగా కోలుకున్నాడు.
ఇటీవలే బెంగళూరులో సౌతాఫ్రికా–ఎ టీమ్తో అనధికార టెస్టు మ్యాచ్లో ఆడి రెండో ఇన్నింగ్స్లో 90 రన్స్ చేసి తన ఫిట్నెస్, ఫామ్ను నిరూపించుకున్నాడు. శుభ్మన్ గిల్ కెప్టెన్గా వ్యవహరించే 15 మంది సభ్యుల జట్టుకు, పంత్ వైస్ -కెప్టెన్ ఎంపికయ్యాడు. కాగా, ఒకప్పుడు జస్ప్రీత్ బుమ్రాతో కలిసి ప్రత్యర్థులకు వణుకు పుట్టించిన 35 ఏండ్ల షమీని టెస్ట్ జట్టుకు ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యకరం. షమీ ఇటీవల బెంగాల్ తరఫున మూడు రంజీ ట్రోఫీ మ్యాచ్ల్లో 93 ఓవర్లు బౌలింగ్ చేసి 15కు పైగా వికెట్లు తీశాడు.
తన ఫిట్నెస్ను నిరూపించుకున్నప్పటికీ సెలెక్టర్లు అతనిపై విశ్వాసం ఉంచలేదు. టెస్ట్ క్రికెట్కు అవసరమైన సుదీర్ఘ స్పెల్స్కు షమీ శరీరం సహకరిస్తుందా? అనే విషయంలో సెలెక్టర్లలో ఇంకా సందేహాలు ఉన్నట్లు తెలుస్తోంది. దాంతోపాటు ఈ మధ్య షమీ తన ఫిట్నెస్ గురించి చీఫ్ సెలెక్టర్ అగార్కర్ను టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు, విమర్శలు కూడా అతని ఎంపికను ప్రతికూలంగా ప్రభావితం చేసి ఉండవచ్చు. ఈ సిరీస్ తర్వాత కనీసం ఆరు నెలల వరకు ఇండియా టెస్ట్ క్రికెట్ ఆడదు కాబట్టి, షమీ టెస్ట్ కెరీర్కు దాదాపు తెరపడినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
మరోవైపు గాయం నుంచి కోలుకున్న బెంగాల్ పేసర్ ఆకాశ్ దీప్ కూడా టెస్ట్ జట్టులోకి తిరిగి వచ్చాడు. తన కోసం ప్రసిధ్ కృష్ణను తప్పించారు. తొలి టెస్ట్ ఈ నెల 14 నుంచి కోల్కతాలో, రెండో టెస్ట్ 22 నుంచి గువాహతిలో జరుగుతాయి. మరోవైపు సౌతాఫ్రికా–ఎతో మూడు వన్డేల సిరీస్ కోసం ఎంపిక చేసిన ఇండియా–ఎ టీమ్ కెప్టెన్సీని హైదరాబాదీ తిలక్ వర్మకు అప్పగించారు. రాజ్కోట్ వేదికగా ఈ నెల 13, 16, 19వ తేదీల్లో ఈ మూడు మ్యాచ్లు జరుగుతాయి.
ఇండియా టెస్టు టీమ్: : శుభ్మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (కీపర్, వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.
ఇండియా–ఎ వన్డే టీమ్: తిలక్ వర్మ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, ఇషాన్ కిషన్ (కీపర్), ఆయుష్ బదోని, నిశాంత్ సింధు, విప్రజ్ నిగమ్, మానవ్ సుతార్, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, ప్రభ్సిమ్రాన్ సింగ్ ( కీపర్).
