ఢిల్లీని వణికిస్తా.. అన్న కేసీఆర్ మాయమై ఇటీవల యశోద లో కనిపించాడని, దుబ్బాక ఎన్నికల తర్వాత సీఎం కి వణుకు పట్టుకుందని బీజేపీ నాయకులు రఘునందన్ రావు అన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మునిసిపాలిటీలోని మల్లారెడ్డి కాలనీలో పలు పార్టీల చెందిన వారంతా బీజేపీలో చేరారు. రఘునందన్ వారికి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పాలిస్తున్న తమపై ఇక్కడ ఒక్క రాష్ట్రాన్ని పాలించే కేసీఆర్ అంతలా ఎగిసిపడితే ఎలా? అని ప్రశ్నించారు. దుబ్బాక ఎన్నికల తర్వాత అల్లుడు శంకరగిరి మాన్యాలు పడితే.., కొడుకు కంప్యూటర్ ముందు పెట్టుకొని రాష్ట్రాన్ని తానే నడుపుతున్నానని ప్రేలేపిస్తున్నాడన్నారు.
పటాన్ చెరు నియోజక వర్గానికి వస్తే ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కి వెంచర్లలో ప్లాట్లను ఎలా గుంజుకోవాలో బాగా తెలుసు కానీ ప్రజల సమస్యలు ఏ ఒక్కటి కూడా పట్టవని అన్నారు రఘునందన్. ఏడు సంవత్సరాల కాలంలో బీరంగుడా నుండి కిష్టారెడ్డిపేట్ వరకు ఇప్పుడు మొదలైన రేడియల్ రోడ్ 2023 వరకు అయినా.. ముగుసేటట్టు లేదని, ఆ తర్వాత వచ్చే ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి ప్రారంభిస్తారేమోనని రఘునందన్ రావు అన్నారు
