బెంగాల్ తరహా విధ్వంసాలకు టీఆర్ఎస్ పాల్పడుతోంది

బెంగాల్ తరహా విధ్వంసాలకు టీఆర్ఎస్ పాల్పడుతోంది

కేసీఆర్ అధికారం కోల్పోవడం ఖాయమని బీజేపీ తెలంగాణ ఇంఛార్జి తరుణ్ చుగ్ అన్నారు. నిన్న జనగామ జిల్లా దేవరుప్పల మండల కేంద్రంలో ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బండి సంజయ్ చేపట్టిన పాదయాత్రలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ ఘటనలో బీజేపీ నేతలపైకి టీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. రెండు గంటలకు పైగా సాగిన ఈ ఆందోళనలో పలువురు బీజేపీ కార్యకర్తలు గాయపడగా.. ఒక వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో బీజేపీ వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ చుగ్ పలు కామెంట్లు చేశారు. అందులో భాగంగా బండి సంజయ్ యాత్రపై టీఆర్ఎస్ చేసిన దాడిని ఖండిస్తున్నానని చెప్పారు. టీఆర్ఎస్ గుండాలతో సంజయ్ యాత్రను ఆపాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఎవరు ఎలాంటి కుట్రలు చేసినా ప్రజా సంగ్రామ యాత్ర ఆగదన్న తరుణ్ చుగ్.. బెంగాల్ తరహా విధ్వంసాలకు టీఆర్ఎస్ పాల్పడుతోందన్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల వ్యవహార శైలిపైనా ఆయన నిప్పులు చెరిగారు. పోలీసుల తీరు సైతం సరిగ్గా లేదని, ముఖ్యమంత్రులు వస్తారు పోతారు.  కానీ పోలీసులు మాత్రం న్యాయం వైపే ఉండాలని చెప్పారు. బీజేపీలో చేరికలు జరుగుతూనే ఉన్నాయని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ ల నుంచి చాలా మంది నాయకులు బీజేపీలో చేరుతున్నారని తరుణ్ చుగ్ అన్నారు. అమిత్ షా మునుగోడు సభపై రేపు స్పష్టత ఇస్తామని ఆయన చెప్పారు.