పోచారం నీచ సంస్కృతి.. షోరూంలో ట్రాక్టర్లు కొనకపోతే సర్పంచుల చెక్ పవర్ కట్

పోచారం నీచ సంస్కృతి.. షోరూంలో ట్రాక్టర్లు కొనకపోతే సర్పంచుల చెక్ పవర్ కట్

కామారెడ్డి: టీఆర్ఎస్ ఎమ్మెల్యే, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని తీవ్రంగా విమ‌ర్శించారు బీజేపీ ఎంపీ అర్వింద్. శిథిలావస్థకు చేరుకున్న మందిరాల్లో ఉన్న గబ్బిలాల లాగా .. పోచారం కుటుంబం బాన్సువాడలో ఏళ్లుగా పాతుకుపోయిందని ఆయ‌న‌ అన్నారు. జిల్లాలోని బాన్సువాడలో బిజెపి బహిరంగ సభలో పాల్గోన్న ఆయ‌న‌.. బాన్సువాడ వెనుకబడ్డ ప్రాంతం కాదని , అభివృద్ధి నిర్లక్ష్యం చేయబడ్డ ప్రాంతమని అన్నారు.

యంత్రలక్ష్మి పథకం ద్వారా ఇచ్చే ట్రాక్టర్లు తన షో రూంలో కొనకపోతే సర్పంచుల చెక్ పవర్ కట్ చేసిన నీచ సంస్కృతి పోచారం కుటుంబానిద‌ని అర్వింద్ విమ‌ర్శించారు. బాన్సువాడ‌లో పోచారం కొడుకుల అవినీతి మితిమీరిందని.. ఇసుక అక్రమ రవాణాతో అక్క‌డి ప్ర‌జ‌ల‌ను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. ఆ అక్రమ ఇసుక వ్యాపారంలో కేసీఆర్ కుటుంబానికి కూడా వాటాలున్నాయని చెప్పారు. బాన్సువాడ ప్రజలు ఇకనైనా కళ్ళు తెరవాలని, బండి సంజయ్ నాయకత్వంలో రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తుందని, ప్రభుత్వం ఏర్పాటు చేయటం ఖాయమని చెప్పారు. 2022లో బాన్సువాడ ప్రజలకు పోచారం గ్రహణం వీడనుందని అన్నారు