ఢిల్లీ స్థాయిలో తెలుగు ప్రజల పరువు తీసిన్రు : లక్ష్మణ్

ఢిల్లీ స్థాయిలో తెలుగు ప్రజల పరువు తీసిన్రు : లక్ష్మణ్
  • కొడుకు, బిడ్డ కోసమే పదేండ్లు బీఆర్ఎస్ పని చేసింది: లక్ష్మణ్
  • స్కామ్​లకు పాల్పడుతూ కోట్లు దోచుకుందని ఫైర్

ముషీరాబాద్, వెలుగు: లిక్కర్ స్కామ్​లో తలదూర్చి.. మాఫియాను కూడగట్టి ఢిల్లీ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ.. తెలుగు ప్రజలు, మహిళల పరువు తీసిందని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్ మండిపడ్డారు. కుటుంబం, కొడుకు, బిడ్డ కోసమే బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లు పని చేసిందని విమర్శించారు. ప్రజలు ఎంతో నమక్మంతో అధికారం కట్టబెడ్తే లిక్కర్ స్కామ్​కు పాల్పడిందని ఫైర్ అయ్యారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని కవాడిగూడ, గాంధీనగర్ డివిజన్​లో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులతో లక్ష్మణ్ బుధవారం సమావేశమై మాట్లాడారు. ‘‘పోరాడి సాధించుకున్న తెలంగాణలో భావితరాలు గుర్తు చేసుకునేలా అభివృద్ధి చేయాల్సి ఉన్నా.. బీఆర్ఎస్ సర్కార్ అవేమీ పట్టించుకోలేదు. 

స్కామ్​లకు పాల్పడుతూ ఢిల్లీ స్థాయిలో తెలుగు ప్రజలంటే అసహించుకునేలా చేసింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం... ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు. అందరికీ ఉచితం అని చెప్పి.. కొందరికే అని షరతులు పెట్టడం ఏంటి? గత ప్రభుత్వం దళిత బంధు స్కీమ్ కొంత మందికే పరిమితం చేసింది. బీఆర్ఎస్​కు పట్టిన గతే.. కాంగ్రెస్​కు పడుతుంది’’అని లక్ష్మణ్ విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన అన్ని స్కీమ్స్.. దేశ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని అన్నారు.  రానున్న లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీతో మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ లీడర్లు వినయ్ కుమార్, రత్న సాయిచంద్, ఆనంద్, సత్తిరెడ్డి, శ్రీకాంత్, మంగమ్మ, లావణ్య తదితరులు పాల్గొన్నారు.