కరోనాతో బీజేపీ ఎంపీ మృతి

కరోనాతో బీజేపీ ఎంపీ మృతి

బీజేపీకి చెందిన ఎంపీ నంద్ కుమార్ సింగ్ చౌహాన్ కరోనాతో మృతిచెందారు. ఆయన మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చౌహాన్ కరోనా భారినపడటంతో ఢిల్లీలోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనను వెంటిలేటర్ మీద ఉంచి వైద్యం అందిస్తున్నారు. కాగా.. ఆయన ఆరోగ్యం విషమించడంతో మంగళవారం ఉదయం కన్నుమూశారు.

సెప్టెంబర్ 8, 1952లో బుర్హాన్‌పూర్‌లో జన్మించిన నంద్ కుమార్.. మున్సిపల్ కౌన్సిల్‌కు చైర్మన్ ఎన్నికై తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆయన ఖాండ్వా నుంచి అయిదుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. అదేవిధంగా మధ్యప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రెండుసార్లు పనిచేశారు.

వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్న చౌహన్‌ను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ మధ్యే పరామర్శించారు. నంద్ కుమార్ మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీని బలోపేతం చేయడానికి నంద్ కుమార్ ఎనలేని కృషి చేశారని మోడీ అన్నారు.

‘ఖాండ్వా లోక్‌సభ ఎంపీ నంద్‌కుమార్ సింగ్ చౌహాన్ జీ మరణించినందుకు బాధగా ఉంది. పార్లమెంటరీ కార్యకలాపాలు, సంస్థాగత నైపుణ్యాలు మరియు మధ్యప్రదేశ్‌లో బీజేపీని బలోపేతం చేయడానికి ఆయన చేసిన కృషి.. ఆయన చిరకాలం గుర్తుండేలా చేస్తుంది. ఆయన కుటుంబానికి నా సంతాపం తెలియజేస్తున్నాను. ఓం శాంతి’ అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.