
- రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎక్కడుంది?
- బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కామెంట్
- చచ్చిపోయిన పార్టీని యూట్యూబ్ చానళ్లతో లేపుతున్నారని ఎద్దేవా
హైదరాబాద్, వెలుగు: బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై ఎలాంటి చర్చ జరగలేదని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆ పార్టీ పరిస్థితి చెల్లని రూపాయిగా మారిందన్నారు. ప్రజలు కేసీఆర్ ను ఫాంహౌస్ కు పరిమితం చేశారని, బీఆర్ఎస్ కు వీఆర్ఎస్ ఇచ్చారని వ్యాఖ్యానించారు. శుక్రవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు. చచ్చిపోయిన పార్టీని లేపేందుకు యూట్యూబ్ చానల్స్ పెట్టి నడిపిస్తున్నారని ఆరోపించారు.
ఇక్కడి నుంచి అయితే కేసులు అవుతాయని విదేశాల్లో నుంచి యూట్యూబ్ చానల్స్ నడిపిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోతోందని, అదే సమయంలో బీజేపీకి ఆదరణ పెరుగుతోందన్నారు. తనపై కొందరు వ్యక్తిగతంగా బురద చల్లాలని చూస్తున్నారని, పెయిడ్ ఆర్టికల్స్ రాయిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవిత చెల్లని రూపాయిలా మారారని ఎద్దేవా చేశారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో వారి ఆస్తులు పెంచుకున్నారు తప్పితే.. తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమీ లేదని మండిపడ్డారు. కవిత సెల్ఫ్ బ్రాండింగ్ కోసమే బతుకమ్మ ఆడింది తప్ప తెలంగాణ కోసం ఏం కొట్లాడిందని ఆయన ప్రశ్నించారు.
బతుకమ్మ తెలంగాణ సంప్రదాయమని, కవిత వచ్చాక బతుకమ్మ ఆడలేదని విమర్శించారు. బీజేపీతో చర్చలు జరగాయని కేసీఆర్ ను బయటికి వచ్చి చెప్పమనాలని డిమాండ్ చేశారు. తండ్రికి వందల ఉత్తరాలు రాసిన కవితకు.. మీడియాకు ఒక్క లేఖ రాసే ధైర్యం లేదా? అని నిలదీశారు. కుటుంబంలో, పార్టీలో ఏమైనా పంచాయితీ ఉంటే అంతర్గతంగా చూసుకోవా లన్నారు. నాడు మంత్రిగా హరీశ్ తన కూతురి ఆసుపత్రి ఓపెనింగ్ కు వచ్చారని, హరీశ్ తో పాటు తలసాని, స్థానిక ఎమ్మెల్యే సైతం వచ్చారన్నారు.