కడప జిల్లా: న్యూ ఇండియా నిర్మాణమే భారతీయ జనతా పార్టీ సంకల్పమని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సునీల్ దేవధర్ అన్నారు. కడప జిల్లా పోట్లదుర్తిలో రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ నివాసంలో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ అడుగు జాడల్లో నడవటమే బీజేపీ లక్ష్యమని అన్నారు. గాంధీజీ విలువలను ఆదర్శంగా తీసుకోని పాలన సాగిస్తున్నామన్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో గాంధీ సకల్ప యాత్ర నిర్వహిస్తున్నామని, గాంధీజీ విలువైన సేవలను స్మరించుకోవడం ఎంతో అవసరమని ఆయన అన్నారు. అన్ని రాజకీయ పార్టీల నేతలు గాంధీజీ ని గౌరవించాలన్నారు.
పేద ప్రజల సంక్షేమం కోసం ప్రధాని మోడీ ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని సునీల్ అన్నారు. వెనుకబడిన రాయలసీమ ప్రాంత అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. గతంలో కేంద్రం నుంచి మంజూరైన నిధులను గత టీడీపీ ప్రభుత్వం దారి మళ్ళించిందని, మంజూరు చేసిన నిధులకు సంబంధించి ఇంతవరకూ కేంద్రానికి ఇటులిటీ సర్టిఫికెట్ ఇవ్వలేదని సునీల్ అన్నారు. ప్రస్తుత సీఎం కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు కృషి చెయ్యాలని తెలిపారు. కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు బిజెపి కట్టుబడి ఉందని, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులను విడుదల చేసేందుకు కృషి చేస్తున్నామని ఆయన అన్నారు.