V6 News

హార్ముజ్ జలసంధిలో మళ్లీ ఉద్రిక్తత.. భారత్ కు చెందిన రెండు నౌకలపై దాడి

హార్ముజ్ జలసంధిలో మళ్లీ ఉద్రిక్తత.. భారత్ కు చెందిన రెండు నౌకలపై  దాడి

హార్ముజ్ జలసంధి లో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. హార్ముజ్ జలసంధి ద్వారా ప్రయాణిస్తున్న భారత్ కు చెందిన రెండు చమురు నౌకలపై ఇరాన్ కాల్పులు జరిపింది. అయితే ఈ ఘటనలో సిబ్బంది , నౌకలు రెండు ప్రస్తుతం సురక్షితంగా ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.  

హార్ముజ్ తెరిచే ఉంటుందని ప్రకటించిన ఒకరోజు గడవక ముందే  ఇరాన్ మళ్లీ ఆ జలసంధిని మూసివేసింది. జలసంధి ద్వారా నౌకల రాకపోకలను నిషేధించింది.ఈ క్రమంలో శనివారం  ఏప్రిల్ 18, 2026న ఉదయం 9.20 గంటలకు  హార్ముజ్ ద్వారా ప్రయాణిస్తున్న భారత్ కు చెందిన రెండు చమురు నౌకలపై ఇరాన్ సైన్యం దాడి చేసింది. ఒమన్ కు ఈశాన్యంగా 20 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న హార్ముజ్ జలసంధి సమీపంలో IRGC గన్ బోట్లు రెండు నౌకలపై దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ దాడిలో సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. 

అంతకుముందు రోజు హార్ముజ్ జలసంధి తెరిచి ఉంచుతామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ప్రకటించారు. హార్ముజ్ జలసంధి ద్వారా  చమురు నౌకలు స్వేచ్చగా ప్రయాణించొచ్చని చెప్పారు. అయితే ఆ తర్వాత హార్ముజ్ తెరిచిఉంచడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భిన్నంగా  స్పందించారు. ఇరాన్ కు నౌకలకు తప్పా హార్ముజ్ జలసంధి ద్వారా అన్ని దేశాల  నౌకలు ప్రయాణించొచ్చని ప్రకటించారు. ఇరాన్ , అమెరికా మధ్య  కొన్ని ఒప్పందాలు  కుదిరాకే ఇరాన్ ఓడ రేవుల చుట్టూ తమ బలగాలు వైదొలుగుతాయని అన్నారు.  

ట్రంప్ ఈ ప్రకటన చేసిన కొద్ది గంటల్లో ఇరాన్ స్పందించింది. హార్ముజ్ ను పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో రెండు నౌకలను ( ఏ దేశానికి చెందినవో స్పష్టత లేదు)  కాల్పులు జరిపినట్లు ఇరాన్ IRGC  ప్రకటించింది. ఈ దాడితో  మళ్లీ ఆ ప్రాంతంలో  ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.