లోక్​సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలి: తెలంగాణ ప్రజా ఫ్రంట్

లోక్​సభ ఎన్నికల్లో  బీజేపీని ఓడించాలి: తెలంగాణ ప్రజా ఫ్రంట్

ముషీరాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని తెలంగాణ ప్రజా ఫ్రంట్ విమర్శించింది. సనాతన ధర్మం పేరుతో హిందూ కులస్తీకరణ చేసి దేశ భవిష్యత్తును కార్పొరేట్ చేతుల్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని మండిపడింది. ఆదివారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ కాసిం, గడ్డం లక్ష్మణ్, పాశం యాదగిరి పాల్గొని మాట్లాడారు.

కేంద్రంలోని బీజేపీ దేశ సంపదను కుబేరులకు కట్టబెడుతుందని ఆరోపించారు. ఓటమి భయంతో మోదీ మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. లోక్​సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాచయోని నాగభూషణ్, రమాదేవి, నరసింహారెడ్డి, రామారావు, సత్తయ్య, ప్రభాకర్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.