లోన్ పైసలు కట్టకపోతే న్యూడ్ ఫొటోలు షేర్ చేస్తం.. బరితెగించిన రికవరీ ఏజెంట్ల వేధింపులు

లోన్ పైసలు కట్టకపోతే న్యూడ్ ఫొటోలు షేర్ చేస్తం.. బరితెగించిన రికవరీ ఏజెంట్ల వేధింపులు

గచ్చిబౌలి, వెలుగు: క్రెడిట్​కార్డులు, లోన్లు తీసుకుని కట్టకపోతే రికవరీ ఏజెంట్ల వేధింపులు మామూలుగా ఉండవు. ఇంటికి వచ్చి గొడవ చేయడం, పరువు తీయడం, భర్త లోన్​ తీసుకుంటే భార్యకు, భార్య తీసుకుంటే భర్తకు కాల్స్​ చేసి సతాయించడం, బంధువులకూ ఫోన్లు చేసి చెప్పడం జరుగుతున్నదే..కానీ, సైబరాబాద్ ​కమిషరేట్ ​పరిధిలో ఓ మహిళ లోన్​తీసుకుని కట్టినా..అదనపు డబ్బులు డిమాండ్​చేస్తూ రికవరీ ఏజెంట్లు మానసిక హింసకు గురి చేశారు. 15 నెలల్లో ఆమె 57 లోన్​ యాప్స్​ నుంచి సుమారు 83 లక్షలు తీసుకోగా, రూ. కోటి ఐదు లక్షల వరకు తిరిగి కట్టింది.

 అయినా అదనపు డబ్బులు డిమాండ్​చేయడంతో మరో రూ.22 లక్షలు చెల్లించింది. ఊరుకోని ఏజెంట్లు ఇంకా కట్టాలంటూ బూతులు తిడుతూ సోషల్​ మీడియాలో న్యూడ్​ ఫోటోలు అప్లోడ్​ చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. ఏకంగా 105 మొబైల్​ నంబర్స్​ నుంచి రాత్రి, పగలు తేడా లేకుండా కాల్స్​ చేశారు.  ఓటీపీలు పంపారు. చివరకు ఆమె ఫొటోలు మార్ఫింగ్​చేసి ఆమె తల్లికి, చెల్లికి  పంపుతామని అనడంతో సైబరాబాద్​సైబర్​ క్రైమ్ ​పోలీసులను ఆశ్రయించింది.  

లెక్క సరిపోలేదంటూ..

సైబరాబాద్​ కమిషనరేట్​పరిధిలోని బాచుపల్లికి చెందిన మహిళ (32) ఓ ప్రైవేట్​ ఎంప్లాయ్. తన అవసరాల కోసం  నవంబర్​2024 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 57 లోన్​యాప్స్​ నుంచి రూ. 83,83,179 లోన్​ తీసుకుంది. వడ్డీతో కలిపి  రూ. కోటి ఐదు లక్షలు చెల్లించింది. అయినా  రికవరీ ఏజెంట్లు  అదనపు వడ్డీ చెల్లించాలన్నారు. ఒప్పుకోకపోవడంతో కాల్స్​చేసి వేధించడం మొదలుపెట్టారు. దీంతో మరికొన్ని లోన్​యాప్స్​లో లోన్​ తీసుకుని మరో రూ.22 లక్షలు కూడా కట్టింది. అయినా లెక్క సరిపోవడం లేదని మరిన్ని డబ్బులు కట్టాలని మెసేజ్​లు పంపడం, కాల్స్​ చేశారు. 

‘ఆమె ఒక మోసగత్తె...జాగ్రత్త’

ఆమె ఫోన్​లోని ఫొటోలను మార్ఫింగ్​ చేసి ‘ఫ్రాడ్​పర్సన్​’ అని క్యాప్షన్ ​ఇచ్చి కాంటాక్ట్​ లిస్ట్​లోని అన్ని నంబర్లకు పంపించారు. పచ్చి బూతులు తిడుతూ ఆమెకు, ఆమె ఫ్రెండ్స్​కు మెసేజ్​లు పంపారు.  ఆమె బ్యాంక్​ఎకౌంట్​డిటెయిల్స్​తెలుసుకుని ఎవరైతే డబ్బులు పంపుతున్నారో వాళ్లకు కాల్స్​చేసి ‘ఆమె ఒక మోసగత్తె. మా దగ్గర డబ్బులు తీసుకుని ఎగ్గొట్టింది. మీకు కూడా అలాగే చేస్తుంది’ అని తప్పుడు ప్రచారం చేశారు. 

105 మొబైల్​ నంబర్స్​ నుంచి ఏకధాటి కాల్స్​

ఆర్​బీఐ గైడ్​లైన్స్​ప్రకారం.. ఉదయం 8 గంటల్లోపు..రాత్రి 7 తర్వాత కాల్స్​ చేయొద్దని నిబంధనలు ఉన్నా 24 గంటలూ కాల్స్​తో పాటు నాన్​స్టాప్ ​మెసేజెస్​తో విసిగించారు. రోజూ ఆపకుండా ఒకదాని తర్వాత మరొకటి ఇలా సుమారు 1500 ఓటీపీలను ఆమె ఫోన్​కు , ఫ్రెండ్స్​ ఫోన్లకు పంపించి నరకం చూపించారు.  ఇలా ఒక్కటి కాదు ఏకంగా 105 మొబైల్ ​నంబర్స్​ నుంచి కాల్స్ చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఆమె లింక్డ్​ఇన్​ప్రొఫైల్స్​ఆక్సెస్​తీసుకుని పని చేసే ఆఫీసులోని బాస్​కు, కొలిగ్స్​కు ఫోన్​చేసి పరువు తీశారు. ఆమె ఫొటోలు, ఆమె లోన్​వివరాలు హెచ్ఆర్​మేనేజర్​కు పంపి డబ్బులు కట్టించాలంటూ మెసేజ్​లు పెట్టారు. దీంతో వారు  ‘ఇంకోసారి కాల్స్​వస్తే నువ్వు ఉద్యోగం మానెయ్​’ అని చెప్పేశారు. దీంతో ఆమె డిప్రెషన్​లోకి వెళ్లిపోయింది. 

 మీ అమ్మకు, చెల్లికి నీ నగ్న ఫొటోలు పంపుతం

ఇంత చేసినా సదరు మహిళ అదనపు డబ్బులు కట్టడానికి ఒప్పుకోకపోవడంతో ఆమె ఫోన్​, సోషల్​మీడియాలోని ఫొటోలను మార్ఫింగ్​చేసి ఆమె తల్లికి, చెల్లికి పంపుతామని బెదిరించారు.  వాటిని సోషల్​ మీడియాలో కూడా అప్లోడ్​ చేస్తామని వార్నింగ్​ఇచ్చారు. దీంతో ఆమె సైబరాబాద్​ సైబర్​ క్రైమ్​ పోలీసును ఆశ్రయించింది. లోన్​ యాప్స్​ తీసుకున్న డబ్బులకు అదనంగా రూ. 22 లక్షలు కట్టినా, వేధిస్తున్నారని, తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేసింది.

 ఫోన్​ హ్యాక్​ చేసి..

యాప్స్​ నుంచి లోన్ ​తీసుకున్నప్పుడు, లేదా క్రెడిట్​ కార్డులు వాడుతున్నప్పుడు ఆయా యాప్స్​లో అన్ని యాక్సెస్​లు అంటే కాంటాక్ట్​ లిస్ట్​, ఫొటోలు, కెమెరా పర్మిషన్స్​ ఇవ్వడాన్ని రికవరీ ఏజెంట్లు అడ్వాంటేజ్​గా తీసుకుంటున్నారు. సదరు మహిళ కూడా 57 లోన్​ యాప్స్​కు అన్ని పర్మిషన్స్​ ఇవ్వడంతో ఆమె కాంటాక్ట్​ లిస్ట్​ యాక్సెస్​ తీసుకున్నారు. అలాగే కొందరు ఏజెంట్లు ఆమె ఫోన్​ను హ్యాక్ ​చేశారు.