హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రైవేట్ ఇంటర్ కాలేజీల అఫిలియేషన్ల ప్రక్రియలో వెలుగుచూస్తున్న నకిలీ సర్టిఫికెట్ల బాగోతానికి చెక్ పెట్టేందుకు ఇంటర్ బోర్డు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తిగా ఆన్లైన్ చేయాలని డిసైడ్ అయింది. ప్రధానంగా ఫైర్ ఎన్ఓసీలు, ఇతర కీలక పత్రాల తనిఖీలో పారదర్శకత పెంచేలా సరికొత్త ప్రణాళికను రూపొందిస్తోంది.
రాష్ట్రంలో 1,400కు పైగా ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. ఆయా కాలేజీలు ఏటా ఇంటర్ బోర్డుకు అఫిలియేషన్ కోసం దరఖాస్తు చేసుకొని.. గుర్తింపు పొందుతుంటాయి. కాలేజీల అఫిలియేషన్ కోసం ఫైర్ ఎన్ఓసీ, సెల్ఫ్ డిక్లరేషన్, శానిటరీ, స్ట్రక్చరల్ సౌండ్ నెస్, ఆర్ఎల్డీ వంటి పత్రాలను అడ్వకేట్ నోటరీతో మేనేజ్మెంట్లు అప్లోడ్ చేస్తున్నాయి.
నిబంధనల ప్రకారం జిల్లాల్లో డీఐఈఓలు నేరుగా కాలేజీలకు వెళ్లి ఆ ఒరిజినల్ సర్టిఫికెట్లను వెరిఫై చేయాల్సి ఉంటుంది. కానీ, క్షేత్రస్థాయిలో కొందరు అధికారులు కాలేజీ యాజమాన్యాలతో చేతులు కలపడంతో తనిఖీలు నామమాత్రంగా సాగుతున్నాయి. ఈ మిలాఖత్తో నకిలీ సర్టిఫికెట్లతో పర్మిషన్లు పొందుతున్న విషయం అధికారుల దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే హైడ్రా సహకారంతో నకిలీ పత్రాల ఆట కట్టించాలని బోర్డు భావిస్తోంది.
ఆన్లైన్ వెరిఫికేషన్.. ప్రత్యేక విండో
నకిలీ సర్టిఫికెట్లను అరికట్టడానికి ఇంటర్ బోర్డు వెబ్సైట్లో మార్పులు చేస్తోంది. ఫైర్ ఎన్ఓసీల వెరిఫికేషన్ కోసం ప్రత్యేకంగా వెబ్సైట్లో ఒక విండో ఏర్పాటు చేయబోతున్నారు. దీంతో కాలేజీలు సమర్పించిన ఎన్ఓసీలు ఒరిజినలా కాదా అనేది ఆన్లైన్ డేటా ద్వారా క్షణాల్లో తేలిపోనున్నది.
మరోపక్క ఫైర్ ఎన్ఓసీల జారీలోనూ బోర్డు కీలక మార్పులు చేయబోతోంది. ఏడాదంతా ఎన్ఓసీలు ఇవ్వకుండా, కేవలం కాలేజీల అఫిలియేషన్ నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి కేవలం మూడు నెలల పాటు మాత్రమే వీటిని జారీ చేసేలా నిబంధన తీసుకురానుంది. దీంతో పాత సర్టిఫికెట్లతో లేదా నకిలీ పత్రాలతో మాయాజాలం చేసే అవకాశం ఉండదని అధికారులు చెపుతున్నారు.
పట్టుబడిన 71 కాలేజీలు..
అఫిలియేషన్ కోసం ఫేక్ ఎన్ఓసీలు పెట్టిన కాలేజీల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే 52 కాలేజీల లిస్టును హైడ్రా ప్రకటించగా.. ఆయా కాలేజీలకు రూ.8 లక్షల చొప్పున ఇంటర్ బోర్డు ఫైన్ వేసింది. ముందుగా గుర్తించిన 8 కాలేజీలపైనా ఫోర్జరీ కేసులు పెట్టారు. ఇంకా ఫేక్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొనసాగుతుండటంతో గురువారం నాటికి 71 ప్రైవేటు కాలేజీలు ఫేక్ ఎన్ఓసీలు పెట్టినట్టు అధికారులు గుర్తించారు.
ఆయా కాలేజీలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది వెరిఫికేషన్ పూర్తయ్యాక నిర్ణయం తీసుకుంటామని ఇంటర్ బోర్డు సెక్రటరీ అభిలాష అభినవ్ ‘వెలుగు’తో చెప్పారు. త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఆయా కాలేజీల్లో చదివే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
