హైదరాబాద్, వెలుగు: వర్షాలు, వరదలు వచ్చినప్పుడు వెంటనే స్పందించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనని బీజేపీ అధికార ప్రతినిధి రచనారెడ్డి అన్నారు. మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వాన్ని పక్కన పెట్టి రేవంత్ రెడ్డి కేంద్రంపై విమర్శలు చేస్తున్నారని ఫైరయ్యారు. పీసీసీ చీఫ్తోపాటు కాంగ్రెస్ నాయకులు బురద రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఆదివారం ఆమె పార్టీ స్టేట్ ఆఫీస్లో మీడియాతో ఆమె మాట్లాడారు.
వరద ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎన్ డీఆర్ ఎఫ్ టీమ్లను రంగంలోకి దింపారని, ప్రత్యేక హెలికాప్టర్లను రప్పించి ప్రజల ప్రాణాలు కాపాడారని గుర్తు చేశారు. వరదల నష్టం అంచనా వేయడానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కేంద్ర బృందాన్ని రాష్ట్రానికి పంపుతున్నారన్నారు. భూపాలపల్లి జిల్లాలోని మోరాంచపల్లికి ఏ కాంగ్రెస్ నేత కూడా వెళ్లలేదని, కేంద్రమే టీమ్లను పంపిందన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా వరద ప్రాంతాల్లో బీజేపీ నేతలు పర్యటిస్తూ నష్టాన్ని అంచనా వేస్తున్నారన్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కన్పించడం లేదని మల్కాజ్గిరిలో పోస్టర్లు వేశారని అన్నారు. నియోజకవర్గంలో ఎన్ని ఎంపీ లాడ్స్ ఖర్చు చేశారో రేవంత్ చెప్పాలన్నారు.