
న్యూఢిల్లీ: అహ్మదాబాద్ ఘటన నేపథ్యంలో బోయింగ్ విమానాల భద్రతపై మరోసారి చర్చ జరుగుతున్నది. తాజాగా కుప్పకూలిన ఫ్లైట్ బోయింగ్ 787–8 డ్రీమ్లైనర్. దీన్ని 2011లో బోయింగ్ సంస్థ మార్కెట్లోకి తెచ్చింది. అయితే అప్పటి నుంచి పలుసార్లు సాంకేతిక, నాణ్యతపరమైన సమస్యలు తలెత్తినప్పటికీ.. అది క్రాష్ కావడం మాత్రం ఇదే తొలిసారి. కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ, ఇప్పటి వరకు బోయింగ్ విమానాలలో దీనికి సేఫ్ ఫ్లైట్గానే పేరుంది. డ్రీమ్లైనర్ను మార్కెట్లోకి తెచ్చిన 14 ఏండ్లలో మొత్తం వెయ్యి విమానాలను బోయింగ్ డెలివరీ చేసింది. ఈ ఫ్లైట్ నాన్స్టాప్గా 13,530 కిలోమీటర్లు ప్రయాణించగలదు.
ఇందులో 248 మంది ప్రయాణికులు కూర్చోవడానికి వీలుంటుంది. ఎయిర్ ఇండియా దగ్గర బోయింగ్ 787–8 విమానాలు 27 ఉన్నాయి. కాగా, బోయింగ్ 787-–8 డ్రీమ్లైనర్ ఎయిర్క్రాఫ్ట్లలో గతంలో పలు సాంకేతిక, నాణ్యతపరమైన సమస్యలు తలెత్తాయి. 2013 జులైలో ఎయిర్పోర్టులో నిలిపి ఉంచిన ఫ్లైట్లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి.
అదే ఏడాది ఫ్లైట్లోని బ్యాటరీలు వేడెక్కడం, పోయినేడాది అకస్మాత్తుగా గాలిలో కొన్ని అడుగుల కిందికి ఫ్లైట్ పడిపోవడం లాంటి ఘటనలు జరిగాయి. మరోవైపు డ్రీమ్లైనర్ ఎయిర్క్రాఫ్ట్ తయారీలోనే లోపాలు ఉన్నాయని బోయింగ్ మాజీ ఇంజనీర్ పోయినేడాది ఆరోపణలు చేశారు.