ఎంబీబీఎస్ చదవకుండానే క్లీనిక్.. ఏడాదిగా డాక్టర్ అవతారమెత్తిన ల్యాబ్ టెక్నీషియన్ 

ఎంబీబీఎస్ చదవకుండానే క్లీనిక్.. ఏడాదిగా డాక్టర్ అవతారమెత్తిన ల్యాబ్ టెక్నీషియన్ 

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కుత్బుల్లాపూర్ పరిధిలోని సూరారంలో నకిలీ డాక్టర్ గుట్టు రట్టయింది. సూరారం పోలీసులు,ఎస్‌వోటీ (SOT) పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో బోగస్ క్లినిక్ బండారం బయటపడింది. సూరారం వెంకటరామ నగర్‌లోని బచ్‌పన్ స్కూల్ సమీపంలో ఉన్న రక్షిత క్లినిక్పై పోలీసులు దాడులు చేసి తనిఖీలు చేపట్టారు.

ఎలాంటి వైద్య అర్హతలు లేకుండానే ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఒక బోగస్ డాక్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న సనాది కర్ణాకర్ (35)గా గుర్తించారు. కనీసం ఎంబీబీఎస్ చదవకుండానే అతను డాక్టర్‌గా చలామణి అవుతున్నాడు. ఎలాంటి మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ లేదా లైసెన్స్ లేకుండా గత ఏడాది కాలంగా ఈ క్లినిక్‌ను యథేచ్ఛగా నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

కన్సల్టేషన్ , మందుల పేరుతో అమాయక రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతూ పెద్దఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు సూరారం పోలీసులు తెలిపారు.

ALSO READ : హైడ్రా చొరవతో.. కళకళలాడుతున్న ఉప్పల్ నల్లచెరువు..

ఈ సందర్భంగా సూరారం సీఐ బాలరాజు ప్రజలకు కీలక సూచన చేశారు. ప్రజలు వైద్యం పొందే ముందు డాక్టర్ల అర్హతలు, రిజిస్ట్రేషన్లను తప్పకుండా సరిచూసుకోవాలని కోరారు. ఒకవేళ ఎక్కడైనా నకిలీ డాక్టర్ల సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.