హైదరాబాద్‎లో హై అలర్ట్.. భద్రత కట్టుదిట్టం చేయాలని పోలీసులకు ఆదేశం

 హైదరాబాద్‎లో హై అలర్ట్.. భద్రత కట్టుదిట్టం చేయాలని పోలీసులకు ఆదేశం

హైదరాబాద్: భారత్, పాక్ ఉద్రిక్తతల వేళ హైదరాబాద్‎లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్‎కు బాంబ్ బెదిరింపు కాల్ తీవ్ర కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తి నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్‎లో బాంబు పెట్టామంటూ అధికారులకు మెయిల్ వచ్చింది. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ పోటీలు జరగనున్న నేపథ్యంలో విదేశాల నుంచి పోటీదారులు వస్తుండటం.. మరోవైపు ఆపరేషన్ సిందూర్‎తో ఉద్రిక్తత నెలకొనడంతో.. ముందస్తు చర్యల్లో భాగంగా హైదరాబాద్‎లో హై అలర్ట్ ప్రకటించారు. 

పోలీస్ యంత్రాంగం సిటీలో ఎక్కడికక్కడ నిఘా పెంచింది. నగరంలో జనసామర్ధ్య ప్రదేశాలైన ఎల్బీ నగర్, వనస్థలిపురంలో రాచకొండ డాగ్ స్కాడ్, క్లూస్ టీం ముమ్మర తనిఖీలు చేపట్టింది. చాలా కాలంగా ఒకే చోట పార్క్ చేసిన వెహికల్స్.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన బస్సుల్లో  సోదాలు చేపట్టారు. అనుమానస్పదంగా కనిపిస్తే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

శనివారం (మే 10) నుంచి హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం కానున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులతో హైలెవల్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. మిస్ వరల్డ్ పోటీలకు భారీ సెక్యూరిటీ కల్పించాలని ఆదేశించారు. మిస్ వరల్డ్ పోటీదారులు విడిది చేసే కేంద్రాల్లో మూడంచెల భద్రత ఏర్పాటు చేయాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రత కట్టుదిట్టం చేయాలన్నారు.